ట్రూ క్రైమ్ అంటే నిజజీవితంలో జరిగే నేరాలు. ఈ మధ్య వీటిని నిశితంగా పరిశీలించి, యదార్థ ఘటనలతో డాక్యుమెంటరీలు తీస్తున్నారు. కొందరు వీటి ఆధారంగా పుస్తకాలు రాస్తుంటే, మరికొందరు టెలవిజన్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలను ప్రజలకు చేరువచేసేందుకు స్ట్రీమింగ్ సర్వీసులను వాడుకుంటున్నారు. కాగా, ఓ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రేక్షకులకు భారీ ఆఫర్ ప్రకటించింది. తమ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీని చూసిన వారికి రూ. 1.8 లక్షల వేతనంతో ఉద్యోగం ఇస్తామని ఆఫర్ చేసింది.
మగెల్లన్ టీవీ అనే స్ట్రీమింగ్ సర్వీస్ ఈ ఆఫర్ ప్రకటించింది. గత మూడేళ్లుగా ఇది కొనసాగుతున్నది. వారు ఎంచుకున్న అభ్యర్థి ట్రూ క్రైమ్ కంటెంట్ని ఒక రోజంతా కూర్చుని చూడాలి. అనంతరం దానిపై సోషల్ మీడియాలో ఆకట్టుకునేలా రివ్యూ రాయాలి. ఇలా వారు ఇచ్చిన టాస్క్ పూర్తి చేసినవారికి రూ. 1.8 లక్షల వేతనంతోపాటు మగెల్లన్ టీవీ ఒక ఏడాది సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఇస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో పెట్టింది.