భోపాల్: ప్రొఫెసర్లు అంటేనే ఉన్నత విద్యావంతులు. విద్య ద్వారా తాము సాధించిన జ్ఞానాన్ని, జీవితంలో తమకు ఎదురైన అనుభవాలను రంగరించి విద్యార్థులకు సన్మార్గాన్ని చూపిస్తారు. వారి జీవితాలకు మార్గదర్శనం చేస్తారు. ఇది అందరికీ తెలుసు. అయితే, ప్రొఫెసర్ స్థాయిలో కూడా బుద్ధిలేని మనుషులు ఉంటారని ఎవరూ అనుకోరు. కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో మాత్రం ఓ ప్రైవేటు యూనివర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్ తన బుద్ధితక్కువ తనాన్ని ప్రదర్శించారు.
నడిరోడ్డు మీద వీరంగం సృష్టించారు. వీధివీధికి తిరిగి పండ్లమ్ముకునే ఓ వ్యక్తిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. దుర్భాషలాడుతూ అతని బండిపై ఉన్న పండ్లను ఒక్కొక్కటిగా తీసి రోడ్డుపైకి విసేరేశారు. పండ్ల బండి వ్యక్తి ప్లీజ్ మేడమ్.. పండ్లను నేలపాలు చేయకండి మేడమ్.. అని ఎంత మొరపెట్టుకున్నా ఆ మేడమ్ కనికరించలేదు. కఠిన పదజాలంతో దూషిస్తూ తన వీరంగాన్ని కొనసాగించారు. మేడమ్ వాయిస్లో బేస్ను చూసి రోడ్డుపై వెళ్లేవాళ్లలో కూడా ఎవరూ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
ఇంతకూ మేడమ్ గారీ కోపానికి కారణం ఏందంటే.. మేడం కారుకు పండ్ల బండి రాసుకుందట. దాంతో కారు సైడ్ మిర్రర్ పగిలిపోయిందట. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన మేడమ్ కారు దిగడంతోనే కారుకూతలు మొదలుపెట్టింది. అద్దం వేయించుకోవడానికి అయ్యే ఖర్చు ఇస్తా మేడమ్ అన్నా వినిపించుకోలేదు. అతని బండి మీది పండ్లన్నీ పడేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించండి.