ఎల్జీబీటీ..(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్)లు మన దేశంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్జెండర్లనైతే సమాజం చిన్నచూపు చూస్తున్నది. వీరికి చాలాచోట్ల ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇష్టపడరు. దీంతో వారు బస్టాప్స్, ర్వైల్వే స్టేషన్లు, సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేస్తూ కనిపిస్తుంటారు. పలు శుభకార్యాల్లో ఆశీర్వాదం ఇస్తూ డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. అయితే, తమను చూసే కోణం మారితే పరిస్థితులు వాటంతట అవే మారుతాయని అంటోంది ముంబైకి చెందిన ట్రాన్స్జెండర్ ఆయేషా కోలి. ముంబైలోని ఓ భారీ ఫ్లై ఓవర్ పిల్లర్ల మీద అందమైన కుడ్యచిత్రాలు గీస్తూ జీవితాల్ని ప్రతిబింబిస్తోంది..
ది అరవని ఆర్ట్ ప్రాజెక్ట్ అనే స్వచ్ఛంద సంస్థ.. ట్రాన్స్జెండర్లకు సమాజంలో ఓ గౌరవం లభించాలనే లక్ష్యంతో వారిని చేరదీస్తోంది. అందమైన కుడ్యచిత్రాలు గీయడంలో శిక్షణ ఇస్తోంది. ట్రాన్స్జెండర్లకు ఎక్కడైతే అవమానాలు ఎదురవుతాయో అక్కడే ప్రశంసలు పొందేలా చేయడమే ఈ అరవని ప్రాజెక్ట్ లక్ష్యం. అలా అరవని ప్రాజెక్ట్ సహకారంతో ఆయేషా కోలి మంచి ఆర్టిస్ట్గా మారిపోయింది. భారీ ఫ్లైఓవర్ పిల్లర్లపై తన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటోంది. సమాజంలో గౌరవం పొందుతోంది.