లక్నో: మెడలో పూలమాల వేయబోయిన వరుడి చెంపను వధువు చెళ్లుమనిపించింది. దీంతో పెళ్లి వేడుకకు హాజరైన వారంతా షాకయ్యారు. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక జంటకు పెండ్లి ఖాయమైంది. దీంతో పెండ్లికి అంతా సిద్ధమైంది. బంధువులంతా హాజరయ్యారు. ఫొటోలు, వీడియోలు తీసే కెమేరా సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. అయితే పెండ్లి తంతులో భాంగా వరుడు పూలమాల వేయబోగా బంగారు ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబైన పెండ్లి కుమార్తె అతడి చెంప చెళ్లుమనిపించింది. రెండుసార్లు అతడి చెంపపై కొట్టింది. అనంతరం ఆమె వేగంగా వేదిక దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాబోయే భార్య ఇచ్చిన షాక్ నుంచి పెండ్లి కుమారుడు చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాడు.
మరోవైపు ఈ ఘటనపై వరుడి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వధువు కుటుంబం వారికి నచ్చజెప్పింది. పెండ్లి కుమార్తెను కూడా బుజ్జగించారు. దీంతో వర మాల కార్యక్రమం కొనసాగడంతో కథ సుఖాంతమైంది. అయితే వధువు కోపంతో వరుడి చెంపపై ఎందుకు కొట్టిందో అన్న కారణం తెలియలేదు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని చూసిన నెటిజన్లు పలు ఇమోజీలతో విభిన్నంగా కామెంట్లు చేశారు.