బెంగళూరు: బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరులోని రోడ్లు రాళ్లు తేలాయి. దీంతో స్థానిక ప్రజలు గత కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు దుస్థితిపై ఒక వ్యక్తి ‘యముడు’ వేషధారణలో వినూత్నంగా నిరసన తెలిపాడు. ఛేంజ్మేకర్స్ ఆఫ్ కనకపుర రోడ్ (CMKR) అనే సంస్థ స్థానిక రోడ్డు దుస్థితిపై గత పదేళ్లుగా పోరాడుతోంది. అంజనపుర ప్రాంతంలో రాళ్లు తేలిన, గుంతలమయమైన రోడ్ల గురించి గతంలో చాలా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో దిగి వచ్చిన పాలకులు, అధికారులు 13 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే కేవలం రెండు కిలో మీటర్లు మాత్రమే కొత్తగా రోడ్డు వేశారు.
ఈ నేపథ్యంలో రోడ్డు దుస్థితిని మరోసారి పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ‘ఛేంజ్మేకర్స్ ఆఫ్ కనకపుర రోడ్ (CMKR) ’ సంస్థ మరోసారి రంగంలోకి దిగింది. యముడి వేషం వేసిన వ్యక్తి దున్నపోతుతో కలిసి రోడ్డు మధ్యలో నిల్చొని నిరసన తెలిపాడు. ఈ రోడ్డు యమపురికి రాచ దారి అని పేర్కొన్నాడు. ఆ సంస్థకు చెందిన మరి కొందరు స్థానిక ఎమ్మెల్యే, బెంగళూరు అభివృద్ధి సంస్థ (బీడీఏ)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్ల కార్డులతో నిరసన తెలిపారు.
కాగా, తాజా నిరసనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆ సంస్థ విడుదల చేసింది. ‘రోడ్డుపై యమరాజు? ఆశ్చర్యపోకండి, ప్రజలను తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే కృష్ణప్ప, బీడీఏ యముడికి టెండర్ ఇచ్చారు. శనివారం అంజనాపురం గుంతల రోడ్లపై #CMKR ఒక ప్రత్యేక నిరసన కార్యక్రమం చేపట్టింది. గత సంవత్సరం కఠినమైన నిరసనల తర్వాత కూడా ఎమ్మెల్యే, బీడీఏ మేల్కోలేదు’ అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Yamaraja on roads? Dont be surprised, the MLA Krishnappa & BDA has given him tender to yama to take away people!
Yesterday #CMKR did an unique protest against the #pothole roads of Anjanapura. Even after a very rigours protests last year the MLA & BDA hasnt woken up! pic.twitter.com/G6ValiSWFT
— ChangeMakers of Kanakapura Road (CMKR) ® (@_kanakapuraroad) July 24, 2022