ముంబై: ఇటీవల పెళ్లిళ్లలో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. పెళ్లి వేదిక వద్దకు వరుడు సమయానికి చేరుకోలేదు. దీంతో వధువు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఈ ఘటన జరిగింది. మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో ఈ నెల 22న ఒక జంటకు పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు పెళ్లి ముహూర్తం. అయితే వరుడు ఆ సమయానికి పెళ్లి మండపానికి చేరుకోలేదు. మద్యం సేవించి బంధువులు, స్నేహితులతో కలిసి డ్యాన్సులు వేశాడు. తన వారితో కలిసి రాత్రి 8 గంటలకు పెండ్లి మండపం వద్దకు వచ్చాడు.
మరోవైపు పెళ్లి కుమారుడి కోసం పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, బంధువులు వేచి చూసి విసిగిపోయారు. ముహూర్తం దాటిన తర్వాత వచ్చిన వరుడి తీరుపై వధువు తండ్రి ఆగ్రహం చెందాడు. అతడితో పెళ్లి జరిపించేందుకు నిరాకరించాడు. పెళ్లికి వచ్చిన ఒక బంధువుతో మాట్లాడి అతడి కుమారుడితో తన కుమార్తెకు పెళ్లి చేశాడు. వరుడి తరుఫు వారు ముహూర్తానికి పెళ్లి వేదిక వద్దకు రాలేదని, డ్యాన్సుల్లో వారు బిజీగా ఉన్నారని ఆయన ఆరోపించాడు. అందుకే బంధువు కుమారుడితో తన కుమార్తెకు పెళ్లి జరిపించినట్లు చెప్పాడు.