బాలి: సముద్ర తీరంలోని కొండ అంచున ఉన్న విమానం రెక్కపై ఒక వ్యక్తి నడిచాడు. ఆ విమానం రెక్క కొండ లోయ మీదకు ఉండటంతో అతడి సాహసం, ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడారు. చాలా మందికి ఎత్తైన ప్రాంతాల నుంచి కింద చూస్తే కళ్లు తిరుగుతాయి. అలాగే లోయలోకి తొంగి చూడాలంటేనే భయపడిపోతుంటారు. అయితే ఇండోనేషియాలోని బాలి దీవికి చెందిన ఒక వ్యక్తి సాహసం చేశాడు. ఉలువాటు బడంగ్ రీజెన్సీలోని న్యాంగ్-న్యాంగ్ బీచ్ వద్ద సముద్ర తీరంలోని కొండ అంచులో ఒక పాత పెద్ద బోయింగ్ విమానాన్ని ఉంచారు. దాని రెక్కలు ఆ కొండ లోయపై సముద్రం మీదుగా ఉంటాయి. ఇది ఆ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చింది.
కాగా, బాలికి చెందిన ఫొటోగ్రాఫర్ కోమింగ్ ధర్మవాన్ పెద్ద సాహసం చేశాడు. కొండ అంచు మీదుగా ఉన్న ఆ విమానం రెక్కపై ఎంతో ఈజీగా నడిచాడు. ఏ మాత్రం భయాందోళన చెందలేదు. అలాగే సేఫ్టీ కోసం ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. ఎర్త్పిక్స్ అనే టూరిస్ట్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు 1.1 కోటి మంది ఈ వీడియోను చూశారు. 5.5 లక్షల మంది దీనిని లైక్ చేశారు. అతడి ధైర్య, సాహసాలను నెటిజన్లు కొనియాడారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంపై కొందరు విమర్శించారు.