హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): యాదాద్రిలో రెండు కోట్లతో ఒక్కో కాటేజీ చొప్పున దాతల సాయంతో 250 కాటేజీలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తెలిపారు. మంగళవారం యాదాద్రిలో మీడియాతో మాట్లాడారు. వివరాలు.. ఆయన మాటల్లోనే..
టెంపుల్ సిటీ నిర్మాణం
భక్తులు ఉండేందుకు 900-1000 ఎకరాల స్థలాన్ని సేకరించి టెంపుల్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం. ప్రసిద్ధ వ్యక్తులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయి వ్యక్తులు, గవర్నర్లు, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వస్తే కూడా స్వామివారిని దర్శించి.. ఒకటి-రెండు రోజులు ఇక్కడ ఉండే విధంగా 13 ఎకరాల స్థలంలో రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం చేపట్టాం. అవి త్వరలో అందుబాటులోకి వస్తాయి. 1500 మంది భక్తులు ఉండేలా ధర్మశాలలు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లేఔట్ 1000 సూట్లతో కూడిన 250 అద్భుతమైన కాటేజీల నిర్మాణం కూడా రేపో, ఎల్లుండి నుంచో ప్రారంభిస్తాం. మేము కడతామని చాలామంది అడుగుతున్నారు. ఒక్కో యూనిట్ రూ.రెండు కోట్ల వ్యయం అవుతుంది. ఒక్కో దాంట్లో నాలుగు సూట్లు ఉంటాయి. నాలుగు కుటుంబాలు ఉండేలా వీటిని నిర్మిస్తారు. దీనికోసం 1000, 900, 1200 గజాల ప్లాట్లు, సువిశాలమైన రోడ్లు ఉన్నాయి.
తక్కువ వ్యయంలో చిన్న కాటేజీల నిర్మాణం
కాటేజీల నిర్మాణానికి కొందరు దాతలు రూ.50 లక్షలు, రూ.25 లక్షల వరకు పెడుతామంటున్నారు. వాళ్లకు కూడా స్థలం కేటాయిస్తాం. మొదటి ఫేజ్లో మాత్రం 2 కోట్లతో ఒక కాటేజీ నిర్మాణాన్ని చేపడుతాం. యాదాద్రి స్థాయిలో కాటేజీలు ఉండాలని రూ.2 కోట్లతో వాటిని నిర్మిస్తున్నాం. వీటిని నిర్మించడానికి అవసరమైన మొత్తాన్ని ఇవ్వడానికి కొందరు ముందుకొచ్చారు. నాగర్కర్నూలు ఎమ్మెల్యే జనార్దన్రెడ్డి ఒక కాటేజీ నిర్మాణానికి డబ్బులు ఇస్తామన్నారు, మంత్రి మల్లారెడ్డి ఒక కాటేజీ నిర్మాణానికి డబ్బు ఇస్తామన్నారు. 30-40 మంది డబ్బులు ఇవ్వడానికి సంసిద్ధతను వ్యక్తంచేస్తూ కిషన్రావుకు చెప్పారు. కొందరు చెక్కులు కూడా ఇచ్చారు. గుట్ట కింద 200 ఎకరాల స్థలాన్ని సమీకరించాం. రింగ్రోడ్డు లోపల పవిత్రత ఉండాలనే ఉద్దేశంతో ఇతర కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకున్నాం. కొండపైన రెండు గెస్ట్హౌజ్లు మినహా మరేవీ లేవు. పుష్కరిణిని కూడా కిందనే ఏర్పాటు చేశాం. స్వామి వారి దేవ పుష్కరిణి మాత్రమే పైన ఉంటుంది. వర్షాలు తగ్గుముఖం పట్టినందున ఇతర నిర్మాణాలన్నీ చాలా వేగంగా చేపడుతాం. బస్టాండ్కు రూ.6.90 కోట్లను ప్రభుత్వం నుంచే ఇస్తున్నాం. ఫ్రీ బస్సును కొండపైకి నడుపుతాం.