సూర్యాపేట, జూన్ 30 (నమస్తే తెలంగాణ): శ్రీశైలంలో విద్యుదుత్పత్తి తమ హక్కు అని, నీళ్లున్నంతకాలం అక్కడ కరెంటు ఉత్పత్తిచేసి తీరుతామని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. దానిని ఆపడం ఎవరి తరమూ కాదని తేల్చి చెప్పారు. ఏపీ సర్కార్ తీర్మానిస్తే అమలుపరిచేంత అమాయకులు తెలంగాణలో ఎవరూ లేరని అన్నారు. ఇక్కడున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. ఏపీ సర్కార్ గుర్తెరిగి మసలుకోవాలని హితవు పలికారు. బుధవారం సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యుదుత్పత్తి మా హక్కు. దానిని ఆపాలనే హక్కు ఏ కమిటీకిగానీ, కమిషన్కుగానీ లేదు’ అని స్పష్టంచేశారు. ఇంకా అరాచకాలు చేస్తామంటే ఊరుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆపరేషన్ రూల్స్ లేకుండా కట్టిన ప్రాజెక్టులు పోరంబోకు ప్రాజెక్టులుగా మారాయని, ఇప్పుడు కూడా అలాగే చేద్దామని ఏపీ నాయకులు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. తెలంగాణ హక్కులేంటో, కృష్ణాలో రాష్ట్రవాటా ఎంతో స్పష్టంగా తెలుసునని చెప్పారు. వాటాలోంచి ప్రతి చుక్కనూ ఎలా వాడుకోవాలో సీఎం కేసీఆర్కు బాగా తెలుసునని పేర్కొన్నారు.
ఏపీ పాలకులు గతంలో చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారని.. రెండు నదుల నీటి వాడకంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ఏపీ పాలకులు పోగొట్టుకుంటున్నారని జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులు ఎక్కడైనా రైతులేనని, సముద్రుడి పాలయ్యే నీటిని ఒక పద్ధతిలో వాడుకుందామంటూ సీఎం కేసీఆర్ మానవీయకోణంలో గొప్ప ఆ లోచనతో సూచిస్తే.. ఏపీ ప్రభుత్వం మూర్ఖం గానే వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై మూడో వ్యక్తి అవసరం లేకుండా, ఇద్దరమే కూర్చుని మాట్లాడుకుందామని కేసీఆర్ ముందుగానే చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ముమ్మాటికీ అక్రమమేనని, పోతిరెడ్డిపాడు విస్తరణ దుర్మార్గపు చర్య అని మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ చతురతతోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారని గుర్తుచేశారు. నాలుగు దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యను కొద్దికాలంలోనే తేల్చేవారని.. తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సులభతరమయిందన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని చెప్పారు. ఇక్కడ ఉంటున్న అన్ని రాష్ర్టాల ప్రజలూ తెలంగాణకు అతిథులేనని స్పష్టంచేశారు.
భద్రత నడుమ సాగర్లో విద్యుదుత్పత్తి
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన జల విద్యుత్తు కేంద్రం, పులిచింతల ప్రాజెక్టు వద్ద విద్యుదుత్పత్తికి ఆటంకం కలుగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు వద్ద ప్రత్యేక చెక్పోస్ట్ను ఏర్పాటుచేసి విద్యుత్తు ఉత్పాదన కేంద్రంలోకి వచ్చేవారిని తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్సైలు సహా మొత్తం 300 మంది సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్తు ఉత్పాదన కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్, ప్రధాన డ్యామ్పై చెక్పోస్టులను ఎస్పీ ఏవీ రంగనాథ్ బుధవారం పరిశీలించారు.