న్యూఢిల్లీ, ఆగస్టు 12: పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రతిష్టంభనకు ‘మీరే కారణం’ అంటే.. ‘కాదు.. మీ వల్లే సభలు సాగలేదు’ అంటూ అధికార ఎన్డీయే, ప్రతిపక్ష పార్టీలు గురువారం పరస్పరం తీవ్ర ఆరోపణలు గుప్పించుకొన్నాయి. కేంద్రప్రభుత్వం రాజ్యసభలోకి బయటివారిని పిలిపించి విపక్ష ఎంపీలను కొట్టించిందని 11 విపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేశాయి. మహిళా ఎంపీలను కూడా కొట్టారని పేర్కొన్నాయి. మార్షల్స్ లాగా వచ్చింది రాజ్యసభ సెక్యూరిటీ సిబ్బంది కాదని తెలిపాయి. ఈ మేరకు ఆయా పార్టీల నేతల సంతకాలతో కూడిన సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ‘ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చించవద్దని కేంద్రం మొండిపట్టు పట్టింది. పెగాసస్ అంశంపై చర్చ నుంచి కేంద్రం పారిపోయింది’ అని ప్రకటనలో పేర్కొన్నాయి. అంతకుముందు ఈ పార్టీల నేతలు పార్లమెంటులో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చాంబర్లో భేటీ అయ్యారు. కేంద్రం తీరును నిరసిస్తూ పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్సీపీ, శివసేన, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, సీపీఐఎం, సీపీఐ, ఆర్జేడీ, ఐయూఎంఎల్, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్(ఎం) ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. టీఎంసీ, ఆప్, బీఎస్పీ పాల్గొనలేదు. తర్వాత వాళ్లంతా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు కలిశారు. ఎంపీలపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.
మార్షల్ లా విధించారేమో అనిపించింది
పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వం ప్రజల గొంతుకను నొక్కేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటులో ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకపోవడం ప్రజాస్వామ్యాన్ని హత్యచేయడమేనని అన్నారు. ‘ప్రతిపక్ష ఎంపీలు దేశంలోని 60% జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిని మాట్లాడకుండా ఎలా అడ్డుకొంటారు’ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ దేశాన్ని, దేశ ఆత్మను ఇద్దరు ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తలకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. ‘రాజ్యసభలో మార్షల్ లా విధించినట్టు అనిపించింది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్నానన్న భావన కలిగింది’ అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు.
ఎంపీలే మార్షల్స్పై దాడి చేశారు
పార్లమెంటు సమావేశాలు సాఫీగా జరగకుండా అడ్డుకొన్నందుకు ప్రతిపక్షాలు దేశానికి క్షమాపణలు చెప్పాలని కేంద్రప్రభుత్వం డిమాండ్ చేసింది. ఓబీసీ జాబితాపై రాజ్యాంగసవరణ బిల్లు తర్వాత ఏ బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దంటూ కేంద్రమంత్రులను బెదిరించారని ఆరోపించింది. ఎంపీలే మార్షల్స్పై దాడి చేశారని, అందులో ఓ లేడీ మార్షల్ కూడా ఉన్నారని పేర్కొన్నది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా బయటి నుంచి ఎవరినీ తీసుకురాలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు పలువురు కేంద్రమంత్రులు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును కోరారు.