హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ)/ బంజారాహిల్స్: సైబర్ నేరాల నిరోధా నికి పటిష్ఠ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్సార్ యూనివర్సిటీతో కలిసి ముసాయిదా రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రముఖ సాఫ్ట్వేర్, సైబర్ సెక్యురిటీ సేవల సంస్థ ఇవాంటి హైదరాబాద్లో గురువారం తమ సేవలను ప్రారంభించింది. బంజారాహిల్స్లోని దస్పల్లా హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలి సైబర్ సెక్యూరిటీ పాలసీని తెచ్చిందని, ఇప్పుడు సైబర్ క్రైం చట్టంతో మరోసారి దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నదని చెప్పారు. టెక్నాలజీ వినియోగం వల్ల అనేక ప్రయోజనాలున్నప్పటికీ సైబర్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వాలు, సంస్థలు, పరిశ్రమలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఐటీ పెట్టుబడులకు కేరాఫ్ హైదరాబాద్
ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ కేరాఫ్గా మారిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత 5 టెక్ కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా ఉన్నదన్నారు. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఉబర్, నోవార్టిస్, మైక్రాన్ వంటి అనేక పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా తెలంగాణలో ఐటీ వృద్ధిపై ప్రశంసలు కురిపించిందని తెలిపారు. మాల్వేర్ నుంచి 200 మిలియన్ డివైజ్లకు ఇవాంటి సంస్థ సాఫ్ట్వేర్ భద్రత కల్పించడం గొప్ప విషయమన్నారు.
సైబర్ భద్రత విషయంలో రాజకీయనాయకులుగా తాము కూడా ఆందోళన చెందుతుంటామని, అయితే తమ డివైజ్లకు భద్రత కల్పిస్తున్నట్టు ఇవాంటి వంటి సంస్థలు చెప్పడం భరోసా ఇస్తున్నదని చెప్పారు. ఇవాంటి సంస్థ వచ్చే రెండేండ్లలో వర్క్ఫోర్స్ను రెండువేలకు పెంచుతున్నట్టు ప్రకటించిందని, అందులో కనీసం వెయ్యి ఉద్యోగాలు తెలంగాణవారికి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఇవాంటి ప్రెసిడెంట్ నాయకి నయ్యర్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ ముక్కామల తదితరులు పాల్గొన్నారు.