న్యూఢిల్లీ, జూన్ 5: కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్కు కేంద్రప్రభుత్వం నోటీసు జారీ చేసింది. ఇదే చివరి అవకాశమని హెచ్చరించింది. ఇకనైనా కట్టుబడకపోతే ఐటీ చట్టంలో ప్రస్తుతం కల్పిస్తున్న ‘జవాబుదారీ మినహాయింపు’ను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ శనివారం నోటీసుల్లో పేర్కొంది.
‘భారత్లో పదేండ్లకుపైగా పని చేస్తున్నప్పటికీ కొత్త ఐటీ నిబంధనలకు ట్విట్టర్ అంగీకరించకపోవటం నమ్మశక్యంగా లేదు. ట్విట్టర్లో తమకు ఎదురయ్యే సమస్యలను సకాలంలో, పారదర్శకంగా పరిష్కరించుకొనే అవకాశం భారతీయ పౌరులకు ఇవ్వటానికి ట్విట్టర్ నిరాకరిస్తున్నది. కొత్త ఐటీ నిబంధనలను మే 26 నుంచే పాటించాలని మేము ఆదేశించినప్పటికీ ఇన్ని రోజులు ట్విట్టర్ పాటించకపోయినా చూసీచూడనట్లు వదిలేశాం. కానీ, ఇప్పుడు జారీ చేస్తున్న నోటీసు మాత్రం చివరి అవకాశం. తక్షణం కొత్త నిబంధనలకు కట్టుబడాల్సిందే. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటుచేసి అందులో భారతీయ ఉద్యోగుల్ని నియమించాలి. లేదంటే.. ఆ కంపెనీకి ప్రస్తుతం ‘జవాబుదారీతనం నుంచి ఇస్తున్న మినహాయింపు’ను ఉపసంహరిస్తాం. అనంతరం, భారతీయ చట్టాల ప్రకారం పర్యవసనాలు ఉం టాయి’ అంటూ కేంద్రం
వివాదం పెరిగిందిలా
కొత్త ఐటీ చట్టాలు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని ట్విట్టర్ ఇటీవల వ్యాఖ్యానించగా కేంద్రం తీవ్రంగా ఖండించింది. బీజేపీ నేతల ట్వీట్లపై ట్విట్టర్ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది. దేశంలో కరోనా కట్టడిపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ ఓ డాక్యుమెంట్ను రూపొందించింది. దీనిపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలతో కూడిన ట్వీట్లకు ట్విట్టర్ ‘మానిప్యులేటెడ్ మీడియా’ అంటూ మార్క్ చేసింది.
జవాబుదారీ మినహాయింపు అంటే?
ప్రస్తుతం సోషల్ మీడియా సంస్థలకు ఐటీచట్టం కింద జవాబుదారీ మినహాయింపు లభిస్తున్నది. అంటే, ఆ వేదికలపై యూజర్లు పోస్ట్ చేసే సమాచారానికి కంపెనీలు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. మినహాయింపును తొలగించటం అంటే.. ఇకపై ప్రతీ యూజర్ పెట్టే పోస్ట్కు, ట్వీట్కు ఆయా కంపెనీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫిర్యాదులపై పోలీసులు క్రిమినల్ దర్యాప్తు చేపడితే ఆయా కంపెనీలు కూడా నిందితులుగా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనలేమిటి?
ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో మరింత జవాబుదారీతనాన్ని తీసుకువచ్చే పేరుతో కేంద్రం కొత్త ఐటీ నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం..
దేశ సార్వభౌమత్వానికి, దేశంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే విధంగా ఉన్న పోస్టులను తొలుత ఎవరి నుంచి వచ్చాయో గుర్తించే వ్యవస్థను సోషల్మీడియా కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలి.
50 లక్షల యూజర్లు ఉన్న కంపెనీలు.. గ్రీవెన్స్ ఆఫీసర్ను, నోడల్ ఆఫీసర్ను, చీఫ్ కంప్లయెన్స్ ఆఫీసర్ను నియమించుకోవాలి. వీళ్లు భారతీయులై ఉండాలి.
అభ్యంతరకర కంటెంట్ను 36 గంటల్లో తొలిగించాలి. పోర్నోగ్రఫీకి సంబంధించిన కంటెంట్ను 24 గంటల్లో తొలిగించాలి.
ఫిర్యాదు వస్తే 24 గంటల్లో నమోదు చేసుకొని 15 రోజుల్లో పరిష్కరించాలి.
ట్విట్టర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నది?
పోస్ట్ పెట్టిన వ్యక్తి ఎవరో గుర్తించి ఆ వివరాలు ప్రభుత్వానికి ఇవ్వటం అంటే.. తమ యూజర్లు ఇప్పుడున్నంత స్వేచ్ఛగా ఉండలేరని ట్విట్టర్ చెబుతున్నది.
కొత్త ఐటీ నిబంధనలు స్వేచ్ఛగా, బహిరంగంగా చర్చించుకోవటాన్ని అడ్డుకుంటాయని పేర్కొంది. ఇది అంతిమంగా దేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఒక హెచ్చరికలా మారుతాయని తెలిపింది.
భారతదేశంలోని పౌరసమాజంలోని పలువురు కూడా ఈ నిబంధనలను వ్యతిరేకిస్తున్నారని పేర్కొంది.
అంతర్జాతీయంగా తాము పాటిస్తున్న నిబంధనల మేరకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులను కొనసాగిస్తామని ప్రకటించింది.
ట్విట్టర్తోపాటు వాట్సాప్ కూడా కొత్త ఐటీ నిబంధనలను వ్యతిరేకిస్తున్నది. గూగుల్ వీటిని అమలుచేస్తామని ప్రకటించింది.
బ్లూటిక్ వివాదం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్తోపాటు ఆ సంస్థకు చెందిన మరికొందరి ముఖ్యనేతల ట్విట్టర్ అకౌంట్లపై ఉండే నీలిరంగు టిక్ను ట్విట్టర్ తొలగించటం కలకలం రేపింది. దీంతో ట్విట్టర్ సంస్థ కొంతసేపటి తర్వాత ఆయా అకౌంట్లలో నీలి టిక్ను పునరుద్ధరించింది. ప్రముఖ వ్యక్తుల పేర్లతో ఇతరులు కూడా అకౌంట్లను సృష్టించే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఆయా ప్రముఖుల సొంత ఖాతాలను అధికారికంగా నిర్ధారించటానికి వాటికి ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్మీడియా సంస్థలు నీలిరంగు టిక్ను కేటాయిస్తుంటాయి. ఆరునెలల్లో ఒక్కసారైనా లాగిన్ కాకపోయినా, అకౌంట్ తాలూకు వ్యక్తి వివరాలు పూర్తిగా నమోదు కాకపోయినా.. ఆటోమేటిక్గా బ్లూటిక్ తొలిగిపోతుందని ట్విట్టర్ వివరణ ఇచ్చింది.