హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో చదువులు ఇప్పుడు ఓ ఫ్యాషన్. చదువుతోపాటు డాలర్లు, పౌండ్లు, యెన్లు, యూరోలపై మోజుతో భారతీయులు విదేశాల బాటపడుతున్నారు. పై చదువులు.. ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇతర దేశాల్లోని విద్యార్థులు మాత్రం చదువు కోసం భారత్ను ఎంచుకుంటున్నారు. సర్టిఫికెట్ కోర్సులు మొదలు పీహెచ్డీలవరకు మన విద్యాసంస్థలవైపే చూస్తున్నారు. గతేడాది మన దేశంలో పలు వర్సిటీల్లో 49,348 మంది విదేశీ విద్యార్థులు చేరినట్టు ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (అయిషే) వెల్లడించింది. 120 దేశాలకు చెందిన విద్యార్థులు మన దేశంలో చదువుకుంటుండగా, వీరిలో పురుషులు 32,836, మహిళలు 16,512 మంది ఉన్నట్టు పేర్కొన్నది. మన దేశంలోని వాతావరణం, కోర్సులు, కొన్ని వర్సిటీల్లో గల ఉచిత సీట్ల ఫలితంగా పలు దేశాల విద్యార్థులు భారత్ను ఎంచుకుంటున్నారు.
విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే ‘స్టడీ ఇన్ ఇండియా’ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా విదేశీ విద్యార్థులకు స్కాలర్షిప్స్, పలు వర్సిటీల్లో ఫీజు రాయితీని అమలుచేస్తున్నారు. కొన్నింటిలో 100, 50, 25 శాతం ఫీజు మాఫీచేస్తున్నారు. కేరళలోని అమృత విశ్వవిద్యాపీఠంలో 3,775 సీట్లు ఈ కోటాలో ఉండగా, ఏపీలోని ఆంధ్రా వర్సిటీలో 591 సీట్లు కేవలం విదేశీ విద్యార్థుల కోసమే కేటాయించడం గమనార్హం. ఇదే పథకం ద్వారా విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు తగు గైడెన్స్ ఇస్తున్నారు.