హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): భారతదేశానికి కిరీటం వంటి జమ్ముకశ్మీర్లోని మంచుకొండల్లో సాంకేతిక అద్భుతం నిర్మాణమవుతున్నది. ప్రజావసరాలతోపాటు శత్రువుల నుంచి మన భూభాగాన్ని కాపాడుకొనేందుకు ఇది భవిష్యత్తుల్లో అత్యంత కీలకం కానున్నది. సోనామార్గ్-కార్గిల్-లేహ్- లఢక్లను కలుపుతూ వ్యూహాత్మక రహదారి నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. సముద్రమట్టానికి దాదాపు 11,500 కిలోమీటర్ల ఎత్తులో హిమాలయాలను తొలుస్తూ రెండు భారీ సొరంగాలను తవ్వి ఈ రహదారిని నిర్మిస్తున్నారు.
శ్రీనగర్-లేహ్ మార్గం ఎత్తయిన మంచుకొండలు, అనిశ్చిత వాతావరణంతో ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచుతో కప్పివేయబడుతుంది. దీంతో రవాణా సేవలు నిలిచిపోతాయి. దేశ రక్షణ దృష్ట్యా ఈ మార్గం అత్యంత ముఖ్యమైంది కావటంతో ఏడాది పొడవునా రాకపోకలు సాగించటంతోపాటు ప్రయాణ దూరాన్ని, కాలాన్ని తగ్గించేందుకు ఈ టన్నెళ్లను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే రహదారులు, టన్నెళ్లు భవిష్యత్తు అవసరాలకు ఎంతో ఉపయోగపడనున్నాయి.
ఆధునిక టెక్నాలజీతో..
ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ ప్రాజెక్టును 2012లో ప్రారంభించారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా జోజిలా టన్నెల్లో తూర్పు వైపు నుంచి 120 మీటర్లు, మరోవైపు 380 మీటర్ల పనులే పూర్తిచేశారు. 2018లో జోజిలా, జడ్మోర్ టన్నెల్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నది. దాంతో జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఎన్హెచ్ఐడీఎల్)ఈ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ఇఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ పనులను చేపట్టింది. జడ్మోర్ టన్నెల్ను కేవలం తొమ్మిది నెలల్లోనే పూర్తి చేసింది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేసింది. మంచుతో రోడ్డు పాడవకుండా పాలిస్టిరన్ వినియోగించారు.
డిజిటలైజ్డ్ సిగ్నల్ వ్యవస్థను, వెంటిలేషన్, ట్రాన్స్ఫర్ వెంటిలేషన్ సిస్థమ్గా పిలిచే షాఫ్ట్ లు రెండింటినీ ఏర్పాటుచేశారు. ఇందులో ఎమర్జెన్సీ లైటింగ్, ఆటోమెటిక్ లైటింగ్, మెసేజ్ సిగ్నలింగ్, ఎమర్జెన్సీ టెలిఫోన్, రేడియో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయణించేలా రోడ్డు నిర్మిస్తున్నారు. జోజిలా టన్నెల్ను 2026 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నది. ఇప్పటికే లఢక్వైపు 123 మీటర్లు, శ్రీనగర్వైపు నుంచి 365 మీటర్ల సొరంగ తవ్వకం పూర్తయింది. జడ్మోర్ టన్నెల్ను 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నది. ఈ పనులు 90 శాతం పూర్తయ్యాయి. కేంద్ర ఉపరితల రవాణాశాఖ, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ టన్నెల్ పనులను మంగళవారం పరిశీలించనున్నారని ఎన్హెచ్ఐడీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్జిత్సింగ్ కాంబో తెలిపారు.