న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: నక్సల్స్ సమస్యను నివారించడాన్ని రాష్ర్టాలు అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కోరారు. మావోయిస్టులకు నిధులు చేరకుండా ఈడీ, ఎన్ఐఏ, రాష్ర్టాల పోలీసులు సమన్వయంతో అడ్డుకోవాలని చెప్పారు. తద్వారా ఏడాదిలోగా నక్సల్స్ సమస్యను పూర్తిగా అంతమొందించాలన్నారు. నక్సల్స్ ప్రభావిత రాష్ర్టాల సీఎంలతో ఆదివారం అమిత్ షా ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు, నవీన్ పట్నాయక్ (ఒడిశా), నితీశ్కుమార్ (బీహార్), శివరాజ్సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), ఉద్ధవ్ఠాక్రే (మహారాష్ట్ర), హేమంత్సొరేన్ (జార్ఖండ్) ఈ సమావేశానికి హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, ఏపీ సీఎం జగన్, కేరళ సీఎం పినరయి విజయన్ హాజరు కాలేదు. ఈ సందర్భంగా అమిత్షా మాట్లాడుతూ.. నక్సల్స్పై పోరు చివరి, కీలకమైన దశకు చేరిందన్నారు. ఈ దశలో నక్సల్స్పై పోరు మరింత వేగవంతంగా, నిర్ణయాత్మకంగా ఉండాలన్నారు. దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, గిరిరాజ్సింగ్, అర్జున్ ముండా, నిత్యానందరాయ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
నక్సల్స్తో ప్రజాస్వామ్యానికి ముప్పు
వామపక్ష తీవ్రవాదంతో దేశంలో ప్రజాస్వామ్యానికి ము ప్పు పొంచి ఉన్నదని అమిత్ షా అన్నారు. నక్సల్స్ కొనసాగితే దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రజాస్వామ్య విలువలు చేరవని, అభివృద్ధి జరుగదని పేర్కొన్నారు. నక్సల్స్ జరిపిన హింసలో 40 ఏండ్లలో 16వేల మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశంలో నక్సల్స్ బెడద బాగా తగ్గిందని చెప్పారు. అయితే, సాధించిన దానితో సంతృప్తి చెందకుండా లక్ష్యాన్ని సాధ్యమైనంత త్వరగా చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నదని, సీఏఎస్ఎఫ్ బలగాలకు రాష్ర్టాల ఖర్చును తగ్గించామని చెప్పారు. నక్సల్స్ సమస్య నిర్మూలనపై సీఎంలు తరచూ సమీక్షలు నిర్వహించాలని కోరారు.
ప్రతీ గ్రామానికి ఏకలవ్య పాఠశాల
నక్సల్ ప్రభావిత రాష్ర్టాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై అమిత్ షా ఈ సందర్భంగా ఆరా తీశారు. సమస్య తీవ్రంగా జిల్లాల్లో ఏకలవ్య పాఠశాలలు, పోస్టాఫీసుల ఏర్పాటుకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. ఇప్పటి వరకు 234 ఏకలవ్య స్కూళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఒడిశాలో మావోయిస్టుల ఉనికి తగ్గుతున్నదని, మూడు జిల్లాల్లోనే ప్రభావం ఉన్నదని ఆ రాష్ట్ర సీఎం నవీన్పట్నాయక్ ఈ సందర్భంగా అమిత్ షాకు వివరించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతమంది పిల్లలు జాతీయ స్థాయి పరీక్షల్లో విజేతలుగా నిలిచారన్న విషయంలో ఒక అధ్యయనం నిర్వహించాలని కోరారు.