హైదరాబాద్: తరతరాలుగా కుల వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసమే దళితబంధు పథకాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజకీయాలకు అతీతంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మన దేశంలో ఈ తరహా ప్రయత్నం మునుపెన్నడూ జరగలేదని స్పష్టం చేశారు. ఈ పథకంలో ప్రతి దళిత కుటుంబానికి లబ్ది జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఈ మార్చిలోపే దళితబంధును అమలు చేస్తామని ప్రకటించారు. దేశంలో దళిత జనాభా పెరిగినందున అందుకు తగ్గట్టుగా వారికి రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీ కుల గణనపై కేంద్ర వైఖరిని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వమే మున్ముందు అధికారంలో ఉంటుందని, విపక్షాలు రంగుల కలలు కనొద్దన్నారు. మంగళవారం అసెంబ్లీలో దళితబంధుపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన పలు అంశాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానం ఆయన మాటల్లోనే..
గిరిజనుల కంటే తక్కువ భూములు
గతంలో గరీబీ హఠావో వంటి నినాదాలు చేయడం తప్ప చేసిందేమీలేదు. భూములన్నీ పంచినమని ప్రతిపక్ష నేతలు చెప్తున్నరు. రాష్ట్రంలో 18.22 లక్షల దళిత కుటుంబాల దగ్గర ఉన్నది 13.95 లక్షల ఎకరాలే. రైతుబంధు కింద రాష్ట్రంలో అతి తక్కువ డబ్బులు పొందే రైతులు దళితులే. ఏటా రూ.15 వేల కోట్లల్లో వారికి పోయేది రూ.1400 కోట్లు మాత్రమే. గిరిజనుల కంటే అత్యంత తక్కువ భూములున్న వారు దళితులు. గతంలో ప్రయత్నాలు జరిగినా గణనీయమైన మార్పులు లేవు. హాస్టళ్లలోనో, అక్కడనో.. ఇక్కడనో చదువుకొని పొద్దాక ఉద్యోగాలు, రాత్రి నైట్ కాలేజీలు చేసి ఏ కొద్దిమందో దళితులు బాగుపడి ఉండవచ్చు.
2003లోనే దళిత్ పాలసీకి రూపకల్పన
హుజూరాబాద్ కోసం దళితబంధు పెట్టిన్రని కొందరు అంటున్నరు. 1985లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఉపన్యాసాలలో దళితులపై వివక్ష మీద మాట్లాడిన. అప్పుడు చాలామంది నా మీద తిరుగుబాటు చేశారు. 1986లో దానయ్య అనే దళిత సోదరుడిని మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా చేసిన. ఆ తర్వాత ప్రభుత్వంలో ప్రోగ్రాం లేకపోయినా సిద్దిపేటలో దళిత చైతన్యజ్యోతి పేరుమీద ఓ కార్యక్రమం చేపట్టిన. నాలుగు గ్రామాలను అడాప్ట్ చేసుకొని చక్కటి కార్యక్రమాలు చేసినం. మా నియోజకవర్గం అంతా దళిత మహిళా సంఘాలను ఏర్పాటుచేసినం. వాళ్లకు పనులు ఇప్పిచ్చినం. ఉడతాభక్తిగా కొంత ప్రయత్నం చేసినం. మల్లేపల్లి లక్ష్యయ్య అప్పట్లో వార్త పేపర్లో కరస్పాండెంట్గా ఉండే. ఎస్సీ ఫండ్స్ డైవర్ట్ అవుతున్నయని చెప్తూ ఉండేవారు. తర్వాత వారు దళిత్ స్టడీస్ సెంటర్ ఏర్పాటు చేశారు. అనేక విషయాల మీద పరిశోధనలు చేశారు. మాకు స్టాటిస్టిక్స్ ఇచ్చేవారు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ఉద్యమం చేస్తున్నప్పుడు అనేకమైన లిటరేచర్ ఇచ్చేవారు. ఈ సబ్ప్లాన్ యాక్ట్ కచ్చితంగా తేవాలని చెప్పినదాంట్లో మేమున్నం. అది మల్లేపల్లి ఇచ్చిన ప్రేరణ. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఏమి చేయాలె? దళితుల పరిస్థితి ఏమిటి? అనే విషయంలో లక్ష్మయ్య ఇంట్లో చాలామంది మిత్రులతో వర్క్షాప్ పెట్టినం. తర్వాత మిగతా మేధావులతో బేగంపేట గ్రీన్పార్క్ హోటల్లో టీఎస్ కృష్ణన్, ఎస్సార్ శంకరన్, మన తెలంగాణ ప్రాంతం నుంచే కాదు దళిత మేధావి కత్తి పద్మారావు, వినయ్కుమార్ ఇలా.. చాలా ప్రాంతాల్లోని దళిత మేధావులు దాదాపు 40 మంది కలిసి 2003లో దళిత్ పాలసీకి రూపకల్పన చేశాం.
మనమే ఆవిష్కర్తలం
దళితబంధు తరహా పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇలాంటి పథకానికి వివరాలు ఏవైనా ఉన్నయా? అని చాలామంది ఇంటర్నెట్లో వెతికి చూశారు. మనదేశంలో ఈ తరహా ప్రయత్నమే జరగలేదు. మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమానికి ఆవిష్కర్తలం, కర్తలం కూడా మనమే. దీన్ని అమలు చేయాల్సింది.. వాటి నుంచి ఎదురయ్యే అనుభవాలతో ఈ పథకాన్ని మరింతగా రూపకల్పన చేసుకోవాల్సింది కూడా మనమే. దళితబంధుపై జరిపిన మేధో మథనంలో పాల్గొన్న దళిత ప్రజాప్రతినిధులు అంతా కొన్ని అంశాలు లేవనెత్తారు. ఎస్సీ కార్పొరేషన్ ఎప్పుడో ఇందిరాగాంధీ కాలంలో ప్రవేశపెట్టింది. అందులో రుణం తీసుకొని బాగుపడ్డవాళ్లు కనిపిస్తలేరు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు తీసుకొంటే వాటికి అవీఇవీ కాగితాలు కావాలనడం.. రుణం ఇచ్చినా వాటిని తిరిగి చెల్లించలేకపోవడం, ఇచ్చిన వస్తువులు మళ్లీ లాక్కుపోవడం.. ఇట్లా అనేక అవస్థలుండేవి. ఎక్కడో కొద్దిమందికి మేలు జరిగి ఉండొచ్చు. కానీ రావాల్సినంత మార్పు రాలేదు. ప్రతి కుటుంబానికి కనీసం రూ.10 లక్షలు ఇవ్వాలని దాన్ని ఎకనమిక్ యూనిట్గా తీసుకోవాలనుకొన్నం. ఆ 10 లక్షలతో లబ్ధిదారుడు ఒక ట్రాక్టరో, కారో కొనుక్కుంటాడు. ఏదో యూనిట్ పెట్టుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఫలానాది పెట్టుకోండి అని సూచనలు చేయదు. వారికి నచ్చిన, వారికి వచ్చిన పని ఏదైనా చేసుకోవచ్చు. ఈ డబ్బుతో రెండు మూడు వ్యాపారాలు కూడా పెట్టుకోవచ్చు. నలుగురు కలిసి గ్రూప్గా వ్యాపారం పెట్టుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకుంటే వాళ్లు పెట్టుకున్న వ్యాపారం, తీసుకున్న పని ఫలితం ఇస్తున్నదా? లేదా అన్నది మాత్రం చిప్ ద్వారా తెలుస్తుంది.
మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం
ఈ రాష్ట్రం తెచ్చిన వారిగా మాకు చాలా బాధ్యత ఉన్నది. ముందుముందు కూడా మేమే అధికారంలో ఉంటాం. కొందరికి ఏవో ఈస్ట్మన్ కలర్ డ్రీమ్స్ ఉండొచ్చు. కానీ ప్రజలకు తెలుసు.. ఎవరిని ఉంచాలో.. లేదో. మాది కూడా రాజకీయపార్టీనే కదా. మాదేమీ మఠం కాదు కదా.. మాకు తెల్వదా? మాకు అంచనాలు ఉంటాయి? మాకు సర్వేలు ఉంటాయి. కచ్చితంగా ఇక ముందు కూడా మా ప్రభుత్వమే కొనసాగుతుంది. అందులో సందేహమే లేదు. ఇన్ని మంచి పనులు చేస్తున్న వారిని ప్రజలెందుకు పక్కన పెడతారు? నాకు ఎలాంటి సందేహాలు లేవు. నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్నది.
రక్షణ నిధికి ప్రేరణ.. ఫ్రెండ్షిప్ బ్యాంక్
నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ప్రయోగం చేశాను. ఫ్రెండ్షిప్ బ్యాంక్ అని పెట్టాం. పేరుకు బ్యాంక్ కానీ, అందులో డబ్బులు ఉండవు. రిజిస్టర్లో పేర్లు మాత్రం ఉంటాయి. వారిలో ఎవరికి ఏ అవసరమొచ్చినా అందులో ఉన్న సభ్యులు ఎవరి దగ్గర ఉన్నంత వాళ్లు జమ చేస్తారు. అవతలివాళ్లకు సాయంచేస్తారు. దీన్ని సపోర్టివ్ స్ట్రక్చర్ అంటారు. దీనికి మేం తెలుగులో రక్షణ నిధి అని పేరు పెట్టాం. ఈ దళితబంధు లబ్ధిదారులకు కూడా ఇలానే రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నం. దళిత కుటుంబాలకు ఏదో అనుకోని ఇబ్బంది వచ్చి మళ్లీ ఆ కుటుంబం ఆర్థికంగా కూలిపోవద్దన్నది మా లక్ష్యం. అలా సపోర్ట్ ఇచ్చి నిలబెట్టేదే దళిత రక్షణ నిధి. ఇది నియోజకవర్గ దళిత కమిటీ ఆధ్వర్యంలోనే భద్రంగా ఉంటుంది. ఏదైనా అనుకోని ఆపద వస్తే జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో రక్షణ నిధి నుంచి వారికి సాయం అందిస్తారు. మొత్తం స్కీం అమలయ్యేసరికి ప్రతి నియోజకవర్గానికి కొంత చొప్పున మొత్తం సుమారు రూ.4వేల కోట్లు దళిత రక్షణ నిధిలో జమవుతాయి. కలెక్టర్, కమిటీ పర్యవేక్షిస్తది కాబట్టి ఈ నిధి మిస్యూజ్ అయ్యే అవకాశం లేదు.
జనాభాలో 17.53 శాతం దళిత కుటుంబాలే
దేశంలో దళిత జనాభా 15% అని లెక్కించారు. కానీ వాస్తవం కాదు. రాష్ట్రంలోనే అగ్రిగేట్ తీస్తే 17.53 శాతం దళిత కుటుంబాలు ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,03,93,967 కుటుంబాలుంటే వీటిలో 18,22,291 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇది ఏడేండ్ల కింద చేసిన సర్వే కాబట్టి ఇంకా కొన్ని కుటుంబాలు యాడ్ అయి ఉంటాయి. కాబట్టి దళితుల రిజర్వేషన్ల శాతం పెంచాలి. జాతీయ ప్రభుత్వం దీన్ని గుర్తించాలి. అంబేద్కర్ స్ఫూర్తిని పాటించదల్చుకుంటే కేంద్రం వెంటనే దీన్ని చేయాలి.
ఆ ముసలోళ్లకు ఏదోటి చేస్తం
పథకం అమలుచేస్తూ పోతూ ఉంటే ఎన్నో అనుభవాలు దృష్టిలోకి వస్తున్నయి. హుజూరాబాద్లో ఓ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నరు. అందరికీ పెండ్లిళ్లు అయినయి కాబట్టి అందరికీ దళితబంధు ఇచ్చినం. వాళ్లకు 78 ఏండ్ల తండ్రి, 76 ఏండ్ల తల్లి ఉన్నరు. వాళ్లకు ఏం చేయాలె? రేషన్కార్డు ఉన్నది. ఒకరికి రూ.2 వేల పెన్షన్ వస్తది. మా సంగతి ఏందని వాళ్లు అడుగుతున్నరు. ఇంకో 67 ఏండ్ల అమ్మ ఉన్నది. ఆమెకు కొడుకులు, బిడ్డలు ఎవరూ లేరు. ఆమెకేం చేయాలె? ఈ విషయంపై సీఎస్, రాహుల్ బొజ్జా, మల్లేపల్లి లక్ష్మయ్యతో మాట్లాడిన. వాళ్లను అట్లా వదిలెయ్యొద్దు. ఎంతో కొంత ఇవ్వాలె.. ఉత్తమంగా ఉంటదనే ఆలోచన వచ్చింది. ఇది ప్రాసెస్లో ఉన్నది. ప్రాక్టికల్గా పోతుంటే వచ్చే అనుభవాలు ఎన్నో ఉంటాయి. లక్ష్మయ్య కూడా 75 మందితో టీం తయారుచేశారు. దళిత స్టడీ సెంటర్ నుంచి వాచ్డాగ్లో ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్నరు. ప్రతి మండలానికి పోతున్నరు. అమలు విధానాన్ని పరిశీలిస్తున్నరు.
రైతుబంధు పెట్టినప్పుడు ఇట్లనే అన్నరు
ఆరేండ్ల్ల కిందటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 17,53,000 కుటుంబాలున్నట్లు తేలింది. మరో లక్ష కుటుంబాలు పెరుగొచ్చు. రూ.1.80 లక్షల కోట్లు కూడా కావొచ్చు. ఇంతమొత్తం ఎక్కడి నుంచి తెస్తరని అంటున్నరు. ఎకనమిస్టుల్లోనూ చాలా రకాలుంటరు.. దీన్ని సబ్సిడైజేషన్ తప్పు అని అంటరు. మేం రైతుబంధు పెట్టినప్పుడు కూడా తెలిసినోడు తెల్వనోడు గిట్లనే మాట్లాడిన్రు. కేంద్ర ప్రభుత్వ స్టాటిస్టికల్ విభాగం, ఆర్థిక విభాగం నివేదిక ప్రకారం తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడ పండించిన వరి ధాన్యం విలువ రూ.12 వేల కోట్లు. ఈ రోజు రూ.50 వేల కోట్లు. 3 కోట్ల టన్నుల ధాన్యం పండితే ఎందరికి ఉపాధి ఉంటదో ఆలోచించాలి. దీన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటరు. ఇదంతా రాష్ట్ర అర్థిక ప్రగతికి దోహదం చేస్తది. దళితబంధు కేవలం దళితుల అభివృద్ధికే కాదు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికీ ఉపయోగపడుతది.
అన్ని వర్గాల్లోని పేదలను ఆదుకుంటం
అందరినీ సమదృష్టితో చూస్తూ.. అందరికీ మంచి చేయాలంటే మంచి నాయకత్వం, మంచి పార్టీ ఉండాలి. అది మేము చేసి చూపెట్టినం. మా ప్రతి స్కీమ్ అట్లే ఉన్నది. ఈ వర్గం ఆ వర్గం అనకుండా అందరినీ సమదృష్టితో చూస్తూ, వారివారి అవసరాల దృష్ట్యా ముందుకు పోతున్నం. అందులో భాగంగా మైనార్టీ, బీసీలల్లోని పేదలకు యథాశక్తి చేసుకుంటూ వచ్చినం. ఇయ్యాల దళిత కుటుంబాల్లో ఒక ఆశ చిగురించింది. వారిలో చర్చ జరుగుతున్నది. నాకు అక్కడక్కడ తారసపడిన వారిని ‘మీరేం మాట్లాడుకున్నరు.. ఏం పెట్టుకుందామని అనుకుంటున్నరు?’ అని అడుగుతున్న. ఎక్కడోళ్లు అక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నరు. కరీంనగర్లో ఒకాయన డెయిరీ ఫాంకు రూ.11 లక్షలు ఖర్చయితే సొంతంగా రూ.1.10 లక్షలు కలేసుకున్నడు. ఉన్నతవర్గాల్లో కూడా పేదలున్నరు. చాలా తక్కువ మంది ఉన్నరు. వాళ్ల కోసం కూడా ఆలోచిస్తం.
తెలంగాణ బిడ్డగా ఒక మాట చెప్తున్న. అపనమ్మకాలు సృష్టించేవాళ్లు ఉంటరు. కుర్స బుద్ధితోని మాటలు చెప్పేవాళ్లు ఉంటరు. పార్టీ రహితంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా, ఇప్పుడు దళిత బంధు చేస్తున్నం. అందరికీ వస్తది. తెలంగాణ ఉద్యమానికి బయలుదేరిన్నాడు సావోరేవో తేల్చుకుంట గానీ.. ఉద్యమాన్ని వదల అని చెప్పిన. ఉద్యమం నుంచి పక్కకు జరిగితే రాళ్లతోటి కొట్టుమన్న. రాష్ట్రం తెచ్చి సూపిచ్చిన. సమయం ఎక్కువ పట్టవచ్చు గాక.. ఉద్యమాన్ని మాత్రం ఆపలే. అట్లనే మూడేండ్లలో 24 గంటల కరంటు ఇస్తమంటే.. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి లేచి ‘చెయ్యలేరు.. అది అసాధ్యం’ అని చాలెంజ్ చేసిన్రు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నం. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తయితే మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా మారుతం. అట్లే సాగునీళ్లు తెచ్చినం, వ్యవసాయాన్ని స్థిరీకరించినం, ఆకలి బాధలు రూపుమాపినం, విద్యావకాశాలు పెంచినం. మైనార్టీలకు ఐఏఎస్ శిక్షణ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇస్తున్నం.
ఇదే విధానాన్ని ఇకముందుకూడా కొనసాగిస్తం. రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఏమేం చెప్పినమో అవన్నీ చేశినం. అన్ని వర్గాల్లోని పేదలను ప్రభుత్వం ఆదుకుంటుంది. దళితబంధు లబ్ధిదారులకు మిగతా సంక్షేమ పథకాలు యథావిధిగా అందుతాయి. దళితబంధుకు అర్హత ఏమిటని అడుగుతున్నరు. దళితుడు అయిఉంటే అదే అర్హత. కనీస వ్యవసాయ భూమి రెండున్నర నుంచి మూడెకరాలుండాలి. గతంలో అంతకన్న తక్కువగా అసైన్డ్ భూములు ఇచ్చారు. ఇది అశాస్త్రీయం. కాబట్టి దళితులకు కనీసం మూడు ఎకరాలు ఉండాలని చెప్పాం. వారికి ఎకరా ఉంటే రెండు ఎకరాలు కొనిస్తామని, రెండున్నర ఎకరాలుంటే ఇంకో అర ఎకరా ఇస్తామని హామీ ఇచ్చాం. అంతే తప్ప దళితులకు మూడెకరాల చొప్పున ఇస్తామని అనలేదు. మ్యానిఫెస్టోలో కూడా ఇదే చెప్పాం. కావాలంటే అసెంబ్లీ రికార్డుల్లో కూడా చూడవచ్చు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నరు. వారికి పంపిణీ చేద్దామన్నా భూమి దొరుకడం లేదు. భూమి ఉంటేనే కదా అసైన్డ్ కింద ఇచ్చేది. ప్రభుత్వ అవసరాలకే భూమి దొరకని పరిస్థితి. అయినా 16 వేల ఎకరాల వరకు పంపిణీ చేశాం. ఒక్కో ఎకరానికి గరిష్ఠంగా రూ.ఏడు లక్షల వరకు పెట్టి కొన్నం.
ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు
ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చే అన్ని రంగాలు, అన్ని పనుల్లోనూ వీళ్లకు రిజర్వేషన్ పెడుతున్నం. అక్కడ దళిత బిడ్డలు మాత్రమే పోటీ చేస్తరు. కాబట్టి వారికే అక్కడ అవకాశం దొరుకుతుంది. వైన్స్ల్లో పెట్టిన నిబంధనతో దళితులకు సుమారు 200-250 వైన్స్లు వస్తయి. ఈ రంగంలో వీరికి అవకాశం లేదు.. వేరే వాళ్లేమో పెట్టుబడి పెట్టి లక్షలు, కోట్లు సంపాదించుకుంటున్నరు. ఇప్పుడు ఆ అవకాశం వీరికి కూడా వస్తది. దళిత ఉద్యోగులనూ ఈ పథకం నుంచి మినహాయించం. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని భూమి ఉన్నటువంటి ఉద్యోగికి, వ్యాపారికీ కూడా రైతుబంధు ఇచ్చినం. అదే పద్ధతి దళితబంధులోనూ పెట్టి.. దళితబస్తీ మొత్తం బాగుపడాలనే ఉద్దేశంతో అమలుచేస్తున్నం. ప్రతిదీ ఓటు రూపంలో చూస్తమా? సామాజిక బాధ్యత కూడా ఉంటది. కాకపోతే ఉద్యోగులను చివరికి తీసుకోవాలని అప్పీలు చేసినం.
అంబేద్కర్ పుణ్యం వల్లనే తెలంగాణ
వ్యక్తులు.. పార్టీల తప్పొప్పుల గురించి మాట్లాడను. 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత ఈ రోజు కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మన దళిత ప్రజలు దయనీయస్థితిలో ఉన్నరు. తరతరాలుగా అనేక రకాల హింసకు, మానసిక క్షోభకు, సామాజిక వివక్షకు, దురాచారాలకు గురైన జాతి. మన కండ్ల ముందు కనపడుతున్న సజీవ సాక్ష్యమిది. డాక్టర్ అంబేద్కర్ చాలా చొరవ చూపి, సంఘర్షణ చేసి, రాజ్యాంగ నిర్మాణంలో ఉజ్వల పాత్ర పోషించారు. ఒకనాడు దేశమంతా చర్చించని చాలా విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నకొద్దీ అంబేద్కర్ ఆలోచనాసరళి బయటికి వస్తున్నది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీడియా మిత్రులు నన్నడిగితే ‘జై భీమ్’ అని చెప్పి, ఇయ్యాల రాష్ట్రం ఏర్పడ్డది అంబేద్కర్ పుణ్యమే అని చెప్పిన. ఆయన చెప్పిన విషయాల్లో, చేసిన పోరాటాల్లో చాలావరకు మిగిలిపోయాయి. అణచి వేయబడ్డ వాళ్లకు సాధికారత రాలేదు. చాలా చేసినమని పార్టీలు చెప్పుడు కాదు.. ఫలితం ఏంది? ఏం జరిగింది? అన్నది నా పాయింట్. సమాజంలో జనాభా ఎక్కువ ఉండి, అవకాశాలు తక్కువగా ఉండి సతమతమవుతున్న జాతి దళితజాతి. మనదేశంలో జరిగిన సామాజిక వివక్ష వల్లే ఇవాళ ఈ పరిస్థితి.
ఈ తప్పును మనమే సవరించుకోవాలె. ఏ అమెరికా వాళ్లో.. ఏ రష్యా వాళ్లో వచ్చి చేయరు. ఏ రోజుకైనా మనదేశమే మేల్కోవాలి. అమెరికాలో రెడ్ ఇండియన్స్పై జరిగిన దాష్టీకాల మీద కొన్ని సినిమాలు వచ్చినయి. వాటిని చూసి మా పూర్వీకులు ఎంత దారుణం చేశారని ఏడ్చారు. నల్ల జాతీయుడు ఒబామా అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఒక మేధావి ‘అమెరికా ఈజ్ పేయింగ్ బ్యాక్’ అని ఒక గొప్ప వ్యాసం రాసిన్రు. అట్లా పరిణతి, మానసిక వికాసం వచ్చిన అనేక దేశాల్లో చర్చల ద్వారా చక్కటి పథకాలు పెట్టుకోవటం, చక్కటి మార్గాలు వేసుకోవటం, స్పెషల్ గ్రోత్ ఇంజిన్ పెట్టడం ద్వారా ఆ వివక్షను రూపుమాపి, ఆ జాతులను పైకి తెచ్చిన్రు. ఆనందాన్ని అందరూ పంచుకుంటున్నరు. అటువంటి ప్రక్రియ మనదేశంలో జరగాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగా మేం మొదలుపెట్టిన పోరాట రూపమే దళితబంధు. దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కింద బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు పెట్టినం. ఇటువంటి ప్రయత్నం దేశంలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదు.
లబ్ధిదారుల ఎంపిక స్వేచ్ఛ ఎమ్మెల్యేలకే
మార్చికి ముందు హుజూరాబాద్ నియోజకవర్గంలో శాచురేషన్ మోడ్లో జరుగుతుంది. ప్రతి కుటుంబానికి ఇస్తారు. అట్లానే మిగిలిన 4 మండలాల్లోనూ శాచురేషన్ మోడ్లో జరుగుతుంది. ప్రతి కుటుంబానికి ఇస్తారు. వచ్చే వారం రోజుల్లో డబ్బులు కూడా విడుదల చేస్తాం. ఇప్పటికే అక్కడ స్థానిక కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులను పిలిచి వర్క్షాప్ పెట్టినం. వారు కూడా వెళ్లి మాట్లాడారు. కమిటీల ఏర్పాటు కూడా జరుగుతున్నది. కొన్ని మండలాలకు నేనే స్వయంగా వెళ్లి దళితబంధు పథకం గురించి ప్రజలకు వివరిస్తా. అక్కడ కూడా గ్రౌండింగ్ మొదలు పెడతాం. అన్ని నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఈ మార్చిలోపే అమలు చేస్తం. 4 మండలాలకు కలిపి రూ.వెయ్యి నుంచి 1,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మొదట పెట్టుకున్న వెయ్యి కోట్ల రూపాయలు కూడా ఖర్చవుతాయి. అంటే సుమారు రెండున్నర నుంచి మూడు వేల కోట్ల రూపాయలతో ఈ మార్చి లోపల ఈ కార్యక్రమం అమలుచేస్తాం. దానికి ఎలాంటి అటంకాలు లేవు. అందరు ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు ఈ పథకం అమలుపై ఒక ప్రిలిమినరీ మార్గం ఏర్పడేందుకే తొలుత ఈ మండలాల్లో చేస్తున్నం. ఒకేసారి అంతా చేయలేం కాబట్టి క్రమంగా సంఖ్య పెంచుతాం. అందుకే వారి నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఒక్క మండలం తీసుకుంటారా? రెండు మండలాలు తీసుకుంటారా? లేదంటే మున్సిపాటిలిటీ ప్రాంతం ఉండే ఒక వార్డుతో కలిపి ఒక గ్రామాన్ని తీసుకుంటారా? అన్న స్వేచ్ఛ ఆ ఎమ్మెల్యేకే వదిలేస్తాం. వారు చెప్పిన లబ్ధిదారులకే పథకం అమలుచేస్తాం. క్షేత్రస్థాయిలో ఫలితాలు ఎట్లా ఉంటున్నాయన్నది మనకు ఈ 4 నెలల్లో తెలిసిపోతుంది.
కేంద్రం కుల గణన ఎందుకు చేయదు?
బీసీ కుల గణన చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నది. కేంద్రం అందుకు నిరాకరిస్తున్నది. సుప్రీంకోర్టులో మేం చేయలేమని అఫిడవిట్ వేసింది. తప్పకుండా బీసీల కులగణన జరగాలి. మనం కూడా కులగణనపై అసెంబ్లీలో తీర్మానంచేసి కేంద్రానికి పంపుదాం. ఎస్సీ వర్గీకరణపై తీర్మానంచేసి పంపి ఎన్నో రోజులు అవుతున్నది. అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి నేతృత్వంలో ప్రధానికి 25 సార్లు ఉత్తరాలు ఇచ్చాం. స్వయంగా నేను కూడా వెళ్లి కలిశాను. చెప్పీచెప్పీ సాలిచ్చుకున్నం. తట్టపార కింద పెట్టినం. ఎంతకని చెప్తాం? అసెంబ్లీలోనే ఏకగ్రీవంగా తీర్మానంచేసి పంపినా పట్టించుకోలేదు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు లాంటి గొప్ప గొప్పోళ్లకు చెప్పేది ఏందంటే, కావాలంటే మళ్లీ సీఎస్కి చెప్పి కొత్తగా తయారుచేసి తీర్మానం కాపీ ఇస్తాం. మీరు ఢిల్లీకి వెళ్లి ఎస్సీ వర్గీకరణ చేసి తీసుకురండి. బేగంపేట ఎయిర్పోర్టుకు లేదంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మేం అంతా వచ్చి పెద్దపెద్ద పూల దండలు వేసి స్వాగతం పలుకుతాం. సమ్మతమేనా? లేదంటే వట్టిగనే ఏదో పూసినట్టు అందామంటే సరిపోదు. గొప్ప పథకంపైన మాట్లాడేటప్పుడు చాలా దార్శనికతతో, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఎంతో మంచిది. మీరు (రఘునందన్రావునుద్దేశించి) కొత్తగా గెలిచి వచ్చారు. ఇంకా మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నా. సభలోకి యువకులు రావాలి. ఇంకా బాగా నేర్చుకుని మాట్లాడితే మీకు మరింత ఔన్నత్యం పెరుగుతుంది.
ఏ ఆందోళనా వద్దు.. ఆ డబ్బులు వాళ్లకే ఇస్తాం
దళితబంధులో లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో వేసిన డబ్బులు వాపస్ పోతయ్ అని కొందరు దుర్మార్గులు ప్రచారం చేస్తున్నరు. వాపస్ ఎట్లా పోతాయ్? హుజూరాబాద్లో ఎన్నిక ముగిసినా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కదా! టీఆర్ఎస్కు గీ చిన్న ఎలక్షన్ గురించే ఆలోచన ఉంటుందా? మాకు నెక్ట్స్ ఎన్నిక ఉండదా? అందులో మేం గెలవమా? ఇదో విచిత్రమైన వాదన నడుస్తున్నది. ఒక్క ఎన్నిక కోసం అంత పచ్చి అబద్ధం ఆడతామా? ఇంత దుర్మార్గమా? ఒక బాధ్యతగల ప్రభుత్వం గురించి అలా మాట్లాడటం మర్యాదేనా? దళితబంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో శాచురేషన్ మోడ్లో అమలవుతుంది. హుజూరాబాద్ నియోజకవర్గం తీసుకుంటే, సమగ్ర కుటుంబ సర్వేలో హుజూరాబాద్లో 21 వేల కుటుంబాల లెక్క వచ్చింది. వీరిలో ఇప్పటికే 18 వేల మంది వరకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశారు. అదేవిధంగా బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు కూడా దళితబంధు పథకం చూసి తిరిగి వస్తున్నరు. వాళ్లను కూడా నిరాకరించవద్దని అధికారులకు చెప్పాం. అక్కడ గ్రౌండింగ్ కూడా విజయవంతంగా అమలు చేస్తున్నరు. కరీంనగర్ డెయిరీ కూడా విజయవంతంగా ఉన్నది కాబట్టి రెండు మూడు వేల డెయిరీ ఫాంలకు డిమాండ్ వచ్చింది. ఇట్లా వాళ్లకు నచ్చిన విధంగా పథకాన్ని అమలుచేస్తున్నం. ఇంతపెద్ద రాష్ట్ర ప్రభుత్వం, బడ్జెట్ ఇచ్చిన తర్వాత హుజూరాబాద్ ప్రజలకు డబ్బులు ఇచ్చి మళ్లీ వాపస్ తీసుకునే ప్రసక్తి ఉండదు. అంత చీప్ పనికి ఎవరూ పూనుకోరు. సుభిక్షంగా ఆ డబ్బులు అక్కడే ఉంటాయి. అవి వారికే చెందుతాయి. నెల అయినా, నెల 15 రోజులైనా సరే ప్రజల డబ్బులు వారికే ఉంటాయి. వారికే ఇస్తాం. జిల్లా అధికారులు ఆ పని చేస్తున్నరు. కాబట్టి రఘునందన్రావుకు ఫికర్ అక్కర్లేదు.
వాళ్ల మాటలకు నేను చాలా గర్వపడ్డ
దళితబంధుతో ఉపాధికి సంబంధించి 70-75% వరకు ఇబ్బంది లేదు. ఇప్పటికే వారు ఏదో ఒక దగ్గర జీతానికో, కూలీకో పని చేసుకుంటున్నరు. దాంట్లో వారికి అనుభవం వచ్చింది. హుజూరాబాద్లో స్టేజీపైకి భార్యభర్తలు వస్తే.. ఈ పైసలతో ఏం చేస్తరని అడిగిన. 20 ఏండ్ల నుంచి సెంట్రింగ్లో పనిచేస్తున్నం సార్. ఈ పైసలతో సెంట్రింగ్ యూనిట్ కొనుక్కుంటం సార్ అని చెప్పారు. ఒక యూనిట్ కొనుక్కుంటే మేమే ఇద్దరికి ఉద్యోగం ఇస్తమన్నరు. నేను చాలా గర్వపడ్డ. చాలా సంతోషం అనిపించింది. జీతానికి ఉన్న ఓ వ్యక్తి.. ఇయ్యాల ఆయనే ఓ ఇద్దరికి జీతం ఇస్తనంటున్నడు. తెల్లారే సెంట్రింగ్ యూనిట్ తెచ్చి పని మొదలుపెట్టి.. ఇద్దరు పిల్లగాండ్లకు ఉపాధి ఇచ్చిండు.
సమాజం చేసిన తప్పు సమాజమే దిద్దుకోవాలి
సమాజంలో జనాభా ఎక్కువ ఉండి, అవకాశాలు తక్కువగా ఉండి సతమతమవుతున్న జాతి దళితజాతి. సామాజిక వివక్ష వల్లే ఇవాళ ఈ పరిస్థితి. సమాజం చేసిన ఈ తప్పును సమాజమే సరిదిద్దుకోవాలి. అనేక తరాల నుంచి.. అనేక బాధలు పడి.. కుల వివక్షకు, వెలికి గురై, గ్రామాల బయటే ఉంచబడి.. ఏ సమాజమైతే కూలిపోతున్నదో వాళ్ల కోసం పెట్టిన దళితబంధుపై రాష్ట్రంలో బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి సహృదయంతో ఆలోచించాలని చేతులెత్తి దండంపెట్టి ప్రార్థిస్తున్నా. ఇది మన కర్తవ్యం.
-అసెంబ్లీలో కేసీఆర్ విజ్ఞప్తి
ప్రతి ఎమ్మెల్యే బాధ్యతతో మెలగాలి ఇది చాలా పెద్ద స్కీం. ఎక్కువ పెట్టుబడితో, ఎక్కువ బాధ్యతతో కూడుకున్నది. రాష్ర్టానికి పదింతలు ఆర్థికంగా దోహదం చేసేవిధంగా పరిణమించాలి కాబట్టి మ్మెల్యేలందరినీ ప్రార్థిస్తున్నా.. మీ మీ నియోజకర్గాల్లో అత్యంత బాధ్యతతో ఈ పథకాన్ని అమలు చేయండి.
దళితబంధు కోసం వచ్చే మార్చి
బడ్జెట్లో కనీసం రూ.20 వేల కోట్లు పెట్టుకుంటాం. రెండు లక్షల కుటుంబాలకు దళితబంధు అమలు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండువేల మంది లబ్ధిదారులవుతారు. అప్పుడు ఎక్కువ మండలాలు.. ఎక్కువ గ్రామాల్లో పథకం అమలుకు వీలు కలుగుతుంది.
ఇయ్యాల దళిత కుటుంబాల్లో ఒక ఆశ చిగురించింది. చర్చ జరుగుతున్నది. నాకు అక్కడక్కడ తారసపడితే ‘మీరేం మాట్లాడుకున్నరు.. ఏం పెట్టుకుందామని అనుకుంటున్నరు?’ అని అడుగుతున్న. ఎక్కడోళ్లు అక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నరు. కరీంనగర్లో ఒకాయన డెయిరీ ఫాంకు రూ.11 లక్షలు ఖర్చయితే 1.10 లక్షలు కలేసుకొని తెచ్చుకున్నడు.
రాజకీయాలకు అతీతంగా దళితబంధు
రాష్ట్రంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నయో.. అన్ని కుటుంబాలకు రాజకీయాలకు అతీతంగా దళితబంధు వర్తింపజేస్తాం. ఆ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా సరే. ఓట్లు వచ్చినప్పుడు ఆయన ఇష్టం.. ఏ పార్టీకైనా ఓటు వేసుకోవచ్చు. ఇది నా నిండు మనసుతో చెప్తున్నా. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని రాజకీయ సంకుచితత్వంతో, రాజకీయ ఆలోచనతో డిలే చేయడం తెలివి గల్ల పని కాదు. ఒకాయన ‘సార్.. ఈ స్కీంతో లబ్ధిపొందిన వారు కేసీఆర్ బొమ్మ పెట్టుకోవాలె కదా’ అని నాతో అన్నడు ‘ఒకాయనకు కేసీఆర్ అంటే ఇష్టం ఉండదు.. ఇయ్యవా?’ అని కోప్పడ్డా. ప్రేమున్నోల్లే పెట్టుకుంటరు.. ప్రేమ లేనోళ్లు పెట్టుకోరు.. అసోంటి ఆలోచన చెయ్యొద్దని చెప్పిన. అతను వేరే పార్టీలో ఉన్నడని ఆయన కుటుంబాన్ని మళ్లీ పేదరికంలోనే ఉంచడం తెలివిగల్ల పని కాదు. సాచురేషన్ మోడ్లో దశలవారీగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి వందశాతం దళితబంధు అందిస్తం.