హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): అత్యంత అరుదైన పారాగాంగ్లియోమా అనే కణితితో బాధపడుతున్న జాంబియా దేశస్థురాలికి నగరంలోని కిమ్స్ దవాఖానలో విజయవంతంగా వైద్యు లు శస్త్రచికిత్స చేశారు. ఈ కణితి ప్రపంచంలోనే పది లక్షల మందిలో ఇద్దరికి మాత్రమే వస్తుందని వైద్యులు తెలిపారు. కేసు వివరాలను ఎండోక్రైన్ శస్త్రచికిత్స నిపుణురాలు డాక్టర్ రమ్య వెల్లడించారు. జాంబియా దేశానికి చెందిన 40 ఏండ్ల మహిళ ఐదేండ్లుగా నియంత్రణ లేని రక్తపోటు, తీవ్ర తలనొప్పి, గుండె దడ వంటి సమస్యలతో బాధపడుతున్నది. స్థానికంగా ఎన్ని దవాఖానలు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. జాంబియా ప్రభుత్వం రోగిని నగరంలోని కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్కు రెఫర్ చేసింది. వైద్యపరీక్షలు జరపగా, ఆమె ఉదర భాగంలో కణితి (8.5×7.5 సెం.మీ.) ఉన్నట్టు గుర్తించారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, కణితిని తొలిగించారు. రోగి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ వీరభద్రరావుతో పాటు పలువురు వైద్యసిబ్బంది పాల్గొన్నారు.