హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ వదిలిన బాణమేనని స్పష్టమైంది. పాదయాత్ర పేరుతో తెలంగాణలో గందరగోళం సృష్టిస్తూ, సీఎం కేసీఆర్ మొదలు టీఆర్ఎస్ నేతలందరినీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్న వైఎస్ షర్మిలకు బీజేపీ వెన్నుదన్నుగా నిలుస్తున్నదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. రెండు రోజుల కిందట షర్మిల ప్రగతి భవన్ ముట్టడి పేరుతో హడావిడి చేయగా, పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కమలం పార్టీ శ్రేణులన్నీ షర్మిలకు మీడియాలోనూ, బయటా కవచంలా నిలబడి తమ లోపాయికారి కుట్రను బయటపెట్టుకొన్నాయి.
షర్మిలకు అండగా బీజేపీ మీడియా
షర్మిలకు అండగా నిలబడాలన్న బీజేపీ నాయకత్వ వ్యూహానికి అనుగుణంగా బీజేపీ సోషల్ మీడియా తన ప్రతాపాన్ని చూపింది. మంగళవారం షర్మిల లోటస్పాండ్ నుంచి ప్రగతిభవన్ను ముట్టడించేందుకు బయలుదేరినప్పటి నుంచి బీజేపీ సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో లైవ్ కవరేజ్ ఇవ్వటం మొదలుపెట్టింది. ప్రగతిభవన్కు వెళ్లకుండా ఆమెను నిలువరించినప్పటి నుంచి ఆమె వాహనాన్ని పోలీసులు క్రేన్ సహాయంతో తీసుకెళ్లిన సన్నివేశాలను బీజేపీ సోషల్ మీడియా లైవ్ కవరేజ్ ఇచ్చింది. ఇవ్వటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా బీజేపీ సోషల్ మీడియా వింగ్ కామెంట్లు పెట్టడటమే పనిగా పెట్టుకున్నది. తన ఇంటి నుంచి బయలుదేరే ముందే షర్మిల ‘తనకు మద్దతు ఇవ్వాలని, తను చేసే కార్యక్రమానికి విస్తృత కవరేజ్ ఇవ్వాలని బీజేపీ అనుకూల మీడియా యాజమాన్యాలను కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే షర్మిల సృష్టించిన హంగామా అంతా మునుపెన్నడూలేని విధంగా లైవ్ కవరేజ్తో మీడియా అదరగొట్టింది. రిపబ్లిక్ టీవీ లైవ్ డిబేట్ పెట్టింది.
గవర్నర్ సంఘీభావం వెనుక!
రాష్ట్ర ప్రభుత్వాధినేతగా వ్యవహరించాల్సిన గవర్నర్ తమిళి సై, తన ప్రభుత్వాన్ని తానే తన చులకన చేసుకొంటున్నారు. పోలీసుల చర్యలు తప్పు అన్నట్టుగా, షర్మిల చర్య సరైందన్నట్టుగా ఆమె వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘షర్మిల అరెస్ట్ తనను కలవరపరిచిందంటూ గవర్నర్ ఇంగ్లిష్లో..తెలుగులోనూ ట్వీట్ చేశారు. గవర్నర్ ఆమెకు మద్దతు పలకడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సాక్ష్యాలకేమంటారు?
నర్సంపేటలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహించిన తెలంగాణ వాదులు, ఆమెను ని లదీశారు. షర్మిల చర్య వల్ల టీఆర్ఎస్కు మైలేజ్ వస్తుందని భావించిన బీజేపీ శ్రేణు లు, ఆమెకు అండగా ఉండేందుకు సిద్ధపడ్డాయి. కేంద్రమంత్రి కిషన్రెడ్డి భైంసా సభలో షర్మిలకు బహిరంగంగానే మద్దతిచ్చారు. ‘మహిళ అని చూడకుండా అవమానించారు’ అని పేర్కొన్నారు. ‘ఒక మహిళపట్ల అసభ్యకరమైన రీతిలో టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ ప్రభుత్వం చూ పుతున్న దురహంకారం అసహ్యమైనది’ అని కిషన్రెడ్డి ట్వీట్ చేశారు. బండి సంజ య్ షర్మిలకు సంఘీభావం ప్రకటించారు.