వేల్పూర్, నవంబర్ 30: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావడానికి ఆ నాటి ముఖ్యమంత్రి, సీమాంధ్ర నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియాగాంధీ ప్రకటించగా, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డుపడ్డారని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ను వీడుతానని అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను, సోనియాగాంధీని బ్లాక్ మెయిల్ చేశారన్నారు. వైఎస్ వల్లే తెలంగాణలో వందలాది మంది విద్యార్థులు అమరులు అయ్యారని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఆయన మాట్లాడుతూ.. 2009 డిసెంబర్ 9న ఇచ్చిన ప్రకటనను మళ్లి వెనక్కి తీసుకోవడం వల్ల తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాచ్చుడు ధోరణి వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు. ఆ పాపం కాంగ్రెస్దేనని మంత్రి పేర్కొన్నారు. ఐదేండ్ల ముందే రాష్ట్రం ఇచ్చి ఉంటే ఇప్పుడు తెలంగాణ ప్రగతి ఐదేండ్లు ముందు ఉండేదని తెలిపారు. మలి దశ ఉద్యమంలో కేసీఆర్ ఉవ్వెత్తున్న నడిపిన ఉద్యమంతో అప్పట్లో సోనియాగాంధీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చారని, వైఎస్ ఒత్తిడితోనే మాట తప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మాట తప్పిన కాంగ్రెస్తో పొత్తుని తెంచుకుని మంత్రి పదవులను గడ్డి పోచల వదిలేసి తెలంగాణ కోసం కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, లక్ష్యాన్ని చేరుకున్నారని మంత్రి వేముల తెలిపారు.