హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): నకిలీ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన జంగ దయాకర్రెడ్డిని ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో అమెరికాలో ఉంటున్న ముద్దం స్వామికి సంబం ధం ఉన్నట్టు గుర్తించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాల ప్రకారం.. నాచారానికి చెందిన జంగ దయాకర్రెడ్డి ఇబ్రహీంపట్నంలోని ఏవీఎన్ కాలేజీలో 2014-18లో బీటెక్ (సివిల్) చదివాడు. కానీ, పాస్ కాలేదు. దీంతో నకిలీ సర్టిఫికెట్ ద్వారా అమెరికా వెళ్లేందుకు ప్లాన్ వేశాడు. తనకు రూ.1.3 లక్షలు ఇస్తే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ అమెరికాలో ఉంటున్న ముద్దం స్వామి ఒప్పందం చేసుకొన్నాడు.
స్వామి పంపిన బీటెక్ కంప్యూటర్ సైన్స్ నకిలీ సర్టిఫికెట్ ద్వారా అమెరికాలోని లివీస్, దయాటన్ యూనివర్సిటీల్లో మాస్టర్స్ ఇన్ బిజినెస్ఎనాలటిక్స్లో చేరేందుకు దరఖాస్తు చేశాడు. వీసా కోసం యత్నించి విఫలమయ్యాడు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం నిందితుడిని నాచారం రాఘవేంద్రనగర్లో బుధవారం అరెస్ట్ చేసింది. ఇతని వద్ద నుంచి పలు నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకొన్నది. నకిలీ సర్టిఫికెట్తో ఆమెరికా వెళ్లి అక్కడ ఎంబీఏ చదువుతున్న ముద్దం స్వామిపై ఇప్పటికే ఓయూ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ముద్దం స్వామిని అమెరికా నుంచి డిపోర్టు చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.