జడ్చర్ల టౌన్, మే 16 : పట్టపగలు.. నడిరోడ్డుపై ఓ యువకుడు కత్తితో యువతి గొంతు కోయడంతో మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో కలకలంరేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో నివసిస్తున్న వైష్ణవి (24) పోలేపల్లి సెజ్ ప్రాంతంలోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నది. శనివారం సాయంత్రం పాఠశాలలో విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు వైష్ణవి ఇంటి సమీపంలో కాపుకాశాడు.
ఒంటరిగా వెళ్తున్న యువతిని అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతిచెందింది. స్థానికులు యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులు గాయపడిన యువకుడిని మహబూబ్నగర్ దవాఖానకు తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.