మోత్కూరు, జూన్ 24: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని దత్తప్పగూడెంలో శుక్రవారం దారుణం చోటుచేసుకొన్నది. ఒంటరిగా ఉన్న ఓ యువతి గొంతు కోసిన ఆగంతకుడు పరారయ్యాడు. గ్రామానికి చెందిన ఓ యువతి వలిగొండ మండలం లోతుకుంట ఆదర్శ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. సెలవుల్లో ఇంటి వద్దే ఉంటున్నది. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి పత్తి విత్తనాలు పెట్టేందుకు చేనుకు వెళ్లింది
. పని అయిపోవడంతో సాయంత్రం ముందుగా ఇంటికి వచ్చింది. ఇంటి వద్ద ఒంటరిగా ఉండగా.. మాస్క్ ధరించిన ఇద్దరు యువకులు బైక్పై వచ్చారు. ఒకరు బయట ఉండగా, మరొకతను ఇంట్లోకి వెళ్లి యువతిపై దాడి చేశాడు. ఆమెను గోడకు నెట్టి కత్తితో గొంతు కోశాడు. బాధితురాలు కేక వేయడంతో ఆగంతకులు పరారయ్యారు. అరుపులు విన్న స్థానికులు అక్కడికి వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలిని భువనగిరి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం తెలుసుకొన్న రామన్నపేట సీఐ మోతీ రాం, మోత్కూరు ఎస్సై జానకీరాంరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు.