దండేపల్లి, మార్చి 20: ప్రేమ పేరిట వేధింపులు భరించలేక మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్తమామిడిపెల్లికి చెందిన ఎంబడి సాయిష్మ(22) ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..అదే గ్రామానికి చెందిన నలిమెల వినయ్ ఏడాది నుంచి ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు. ఈ నెల 13న తనకు నిశ్చితార్థం జరిగిందని, వేధించొద్దని సాయిష్మ కోరింది. యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 18న వినయ్ ఆమెకు ఫోన్ చేశాడు.
‘నన్ను పెండ్లి చేసుకో.. లేదా చచ్చిపో’ అంటూ బెదిరించాడు. తనను పెండ్లి చేసుకోకపోతే అంతు చూస్తానని బెదిరించాడు. వేధింపులు తట్టుకోలేక యువతి క్రిమిసంహారక మందు తాగింది. ఈ విషయాన్ని వినయ్ తన స్నేహితునికి, గ్రామంలో మరో వ్యక్తికి చెప్పాడు. వారు వెంటనే యువతిని మేదరిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.