Rachana Bharosa | కథలాపూర్, సెప్టెంబర్ 30: చదువుకొనేందుకు తాను పడ్డ కష్టాలు మరెవరూ పడకూడదని తలంచింది జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామ వాసి అనాథ యువతి రుద్ర రచన. మంత్రి కేటీఆర్ సహకారంతో బీటెక్ పూర్తి చేసిన ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడింది. రచన తన గ్రామానికి చెందిన సాదుల రంజిత్ అనే పేద ఇంజినీరింగ్ విద్యార్థి చదువు కోసం అదే గ్రామానికి చెందిన రచన రూ. 12 వేల ఆర్థిక సాయం శనివారం అందజేసింది. రంజిత్కు హైదరాబాద్లోని ఐఏఆర్ఈ ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ వచ్చింది.
ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా చదువు కొనసాగించలేని స్థితిలో ఉన్న అతడికి సాయం చేసింది. కొన్ని రోజుల తర్వాత ల్యాప్టాప్, రూ. 70 వేలు విలువగల స్టడీ మెటీరియల్ అందిస్తామని రచన హామీ ఇచ్చారు. రుద్ర రచన ఇటీవలే సీఎమ్మార్ఎఫ్కు రూ. లక్ష విరాళాన్ని సీఎం కేసీఆర్కు అందించిన విషయం తెలిసిందే. కాగా, రచనను సర్పంచ్ గడీల గంగప్రసాద్, హెచ్ఎం స్వామి, ఎస్ఎంసీ చైర్మన్ పంజాల ప్రసాద్, నాయకులు పాలెపు రాజేశ్, అల్లూరి జనార్దన్రెడ్డి తదితరులు అభినందించారు.