హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): అత్యుత్తమ పరిశోధన, ఆవిష్కరణల కోసం భారత్ రిస్క్ నుంచి హై-రిస్క్ వైపు మళ్లాల్సిన అవసరం ఉన్నదని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్మజుందార్ షా అన్నారు. మన దేశంలో నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వెనుకబడి ఉండటానికి కారణం పరిశోధనలవైపు దృష్టి పెట్టకపోవటమేనని తెలిపారు. బయో ఏషియా సదస్సు రెండోరోజు శుక్రవారం ‘ఔషధాల పరిశోధన, అభివృద్ధి-నిన్న, నేడు, రేపు’ అనే అంశంపై నిర్వహించిన బృంద చర్చలో ఆమె మాట్లాడారు. పరిశోధనలకు అవసరమైన పర్యావరణ వ్యవస్థను దేశంలో ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. విద్యాసంస్థలతో అనుసంధానం కూడా మెరుగైన పరిశోధనలకు తోడ్పడుతుందని చెప్పారు. అధిక రిస్క్ ఉండే పరిశోధనల్లో పెట్టుబడులు పెట్టడంవల్ల రాబడి అనిశ్చితంగా ఉంటుందని, అందుకే భారత పరిశోధనా సంస్థలు రిస్క్ తీసుకోవడంలేదని తెలిపారు.
పరిశోధన-అభివృద్ధికి పెట్టుబడులు అధికంగా ఉం డి, రాబడుల్లో అనిశ్చితి ఉంటుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ చైర్మన్ సతీశ్రెడ్డి అన్నారు. ఈ రంగం లో ప్రభుత్వాల తోడ్పాటు ఎంతో అవసరమని చెప్పా రు. పరిశోధన పార్కులను ఏర్పాటుచేసి తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉన్నదని తెలిపారు. రిస్క్ ఉండదని భావించినప్పుడే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారని, ప్రభుత్వాలు అటువం టి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇజ్రాయెల్ తరహాలో పెట్టుబడిలో ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటే మరింతమంది ఈ రంగంలోకి వచ్చే ధైర్యం చేస్తారని పేర్కొన్నారు. ఈ చర్చలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్, భార త ఔషధ విభాగం సంయుక్త కార్యదర్శి ఎన్ యువరాజ్, జైడస్ కాడిలా ఎండీ షర్విల్ పటేల్, భారత్ సీరమ్స్ ఎండీ సంజీవ్ నవాంగుల్ పాల్గొన్నారు.