హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పథకాన్ని మరో బీజేపీ పాలి త రాష్ట్రం కాపీ కొట్టింది. మన దగ్గర అమలవుతున్న సంచార పశు వైద్యశాలల (అంబులెన్స్)ను ఇటీవలే కర్ణాటకలో ప్రారంభించగా తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమూ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం అంబులెన్స్లను ప్రారంభించారు. ఈ పథకాన్ని దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వమే అమలు చేసింది. గ్రామాల్లోకి వైద్య సిబ్బంది స్వయంగా వెళ్లి పశువులు, జీవాలకు సత్వర, ఉత్తమ వైద్యం అందించేందుకు ఈ సంచార పశు వైద్యశాల పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం 2017లోనే శ్రీకారం చుట్టింది. దీనికోసం 1962 కాల్సెంటర్ నెంబర్తో 100 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా ప్రతి ఏటా లక్షలాది పశువులు, జీవాలకు వైద్య సేవలను అందిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.40 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నది. ప్రభుత్వం పూర్తిగా సొంత నిధులతోనే ఈ పథకాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. ఈ పథకం అమలుకు ఆరేండ్లలో సుమారు రూ.300 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
తెలంగాణ పథకాలపై కేంద్రం దృష్టి
తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు వివిధ పథకాలను కాపీకొట్టిన కేంద్ర ప్రభుత్వ జాబితాలో సంచార పశు వైద్యశాలల పథకం కూడా చేరింది. తెలంగాణలో సంచార పశువైద్యశాలల పథకం విజయవంతం కావడంతో పశువులు, జీవాలకు ఉత్తమ వైద్యం అందుతుండటంతో ఈ పథకంపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా స్వయంగా రాష్ర్టానికి వచ్చి ఈ పథకం అమలు తీరును, అందిస్తున్న సేవలను పరిశీలించారు.
ఈ పథకం అమలుపై తెలంగాణ రాష్ర్టాన్ని ప్రశంసించారు. తెలంగాణను రోల్మోడల్గా తీసుకొని ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున అమలు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రతి రాష్ర్టానికి కేంద్రం నిధులతో అంబులెన్స్లను సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సాతో పాటు వివిధ రాష్ర్టాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రారంభమైంది. వివిధ రాష్ర్టాలు ఈ పథకాన్ని కాపీ కొడుతుండటంతో తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి దిక్చూచిగా నిరూపితమైంది.