హైదరాబాద్: కాంక్రీట్ జంగిల్గా మారిన సిటీల్లో టెర్రస్ గార్డెన్లను ప్రోత్సహించేందుకు ప్రతీ రెండో శనివారం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఉద్యానవన కమిషనర్ యాస్మిన్ భాషా అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో 18వ గ్రాండ్ నర్సరీమేళా (Grand Nursery Mela) పేరుతో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా హార్టికల్చర్ షోను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రీనరీ ప్రియులకు అందుబాటులో తీసుకువచ్చేందుకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అరుదైన మొక్కలు, విత్తనాలు తీసుకువచ్చి ఒక వేదికగా నర్సరీ మేళాలో ప్రదర్శించడం అభినందనీయమన్నారు. మెడిసినల్ ప్లాంట్స్, కిచెన్, అవుట్డోర్, బల్బ్, సీడ్, సీడ్లింగ్స్, ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్తో పాటు ఎగ్జాటిక్ ప్లాంట్స్, వాటర్ లిల్లీస్, కోకో పిట్, గార్డెన్ ఎక్విప్మెంట్, ఫామ్ ఎక్విప్మెంట్ వంటి వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయన్నారు.
మేళా ఇన్చార్జీ ఖాలీద్ అహ్మద్ మాట్లాడుతూ.. ఏపీ, కోల్కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగళూరు, పుణె, షిర్డీ, కడియం, చెన్నై, వెస్ట్ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మొక్కలతో 150 స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ షోలో టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా సందర్శకులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని కాలీపంగ్ నుంచి ప్రత్యేక ఎగ్జాటిక్ ప్లాంట్స్ స్టాల్ కూడా ఆకర్షణగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనలో రూ.30 నుంచి రూ.3 లక్షల వరకు విలువైన మొక్కలు లభ్యమవుతాయని చెప్పారు.