హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో సరికొత్త వేదిక మెటావర్స్. కంప్యూటర్పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించేందుకు ఇది వీలుకల్పిస్తుంది. భౌతికంగా లేకపోయినా.. అవతార్ల రూపంలో అందరూ ఈ వేదికపై ఒకేచోట చేరి పరస్పరం మాట్లాడుకోవచ్చు. చర్చలు, సమావేశాలు, రోజువారీ కార్యకలాపాలు సహా భౌతిక ప్రపంచంలో చేసుకొనే పనులన్నీ మెటావర్స్ టెక్నాలజీతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేదికపైకి తెలంగాణలోని ప్రముఖ హాస్పిటళ్లలో ఒకటైన యశోద దవాఖాన అడుగుపెట్టింది. మెటావర్స్ టెక్నాలజీని ఉపయోగించుకోనున్న తొలి హెల్త్కేర్ సంస్థగా యశోద దవాఖాన రికార్డులకు ఎక్కింది. టెక్నాలజీ రంగంలోని మార్పులను అందిపుచ్చుకొని ఆరోగ్య సేవలు అందించేందుకు మెటావర్స్ను ఎంచుకొన్నట్టు యశోద దవాఖాన డైరెక్టర్ డాక్టర్ అభినవ్ గోరుకంటి తెలిపారు.