హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): శ్వాసకోశ క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి, నివారించేందుకు ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్ (ఇబస్) పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని యశోద గ్రూప్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్ రావు తెలిపారు. ఇబస్, లంగ్ క్యాన్సర్లపై ఆదివారం హైటెక్ సిటీలోని యశోద దవాఖానలో నిర్వహించిన అంతర్జాతీయ శిక్షణా సదస్సు, లైవ్ వర్షాప్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రధాన పల్మనాలజిస్టులకు ఉన్నత స్థాయి శిక్షణ ఇవ్వడం ద్వారా రోగుల ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో తమ దవాఖాన ఆధ్వర్యంలో ‘ఇబస్ – మాస్టర్ క్లాస్’ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
దేశంలో ఏటా నమోదయ్యే క్యాన్సర్ కేసుల్లో 7 శాతం కేసులకు, 10 శాతం క్యాన్సర్ మరణాలకు శ్వాసకోశ క్యాన్సర్లే కారణమని సీనియర్ పల్మనాలజిస్టు డాక్టర్ వీ నాగార్జున మాటూరు పేర్కొన్నారు. శ్వాసకోశ క్యాన్సర్లు, ప్రాణాంతకమైన వ్యాధులు, ఇన్ఫెక్షన్లను నిర్ధారించే పరీక్షలు రోగులకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటాయని, అదే ‘ఇబస్’ విధానంలో అయితే శరీరంపై ఎటువంటి గాటు పెట్టవలసిన అవసరం ఉండదని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 500 మందికిపైగా పల్మనాలజిస్టులు, అధ్యాపకులు, అంతర్జాతీయ నిపుణులతోపాటు జపాన్ నేషనల్ క్యాన్సర్ సెంటర్ అధిపతి డాక్టర్ యుజి మట్సుమోటో, థాయ్లాండ్కు చెందిన డాక్టర్ తితివాట్ శ్రీప్రసారత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.