హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ):ఈ యాసంగి సీజన్లో 75.2 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఏప్రిల్ 1 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ఈ యాసంగిలో 66.06 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని, 120.91 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లకు అమ్మకాలు, రైతుల సొంత అవసరాలకు పోనూ సగం వరకు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 75.2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. నిరుడు యాసంగిలో 68.84 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. ఈసారి 7,149 సెంటర్లలో ధాన్యం సేకరణ జరపాలని నిర్ణయించారు.