హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): గత వానకాలం(2021-22) సీజన్ సీఎమ్మార్ గడువును నవంబర్ 30 వరకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) పొడిగించింది. గత వానకాలంలో 70.22 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకు ఎఫ్సీఐకి సీఎమ్మార్ కింద 47.05 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 28 లక్షల టన్నులకు పైగా అందజేసింది. మరో 19 లక్షల టన్నులు ఇవ్వాలి. గత నెలతో ముగిసిన సీఎమ్మార్ గడువును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పౌరసరఫరాలశాఖ అధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర అధికారులను, ఎఫ్సీఐ అధికారులను కలిసి పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో సీఎమ్మార్ గడువును పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఫలించిన మంత్రి గంగుల కృషి
గత యాసంగికి సంబంధించి ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ కోటా పెంపుదల కోసం పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చేసిన కృషి ఫలించింది. ఇప్పటికే 8 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్కు అనుమతి ఇచ్చిన ఎఫ్సీఐ.. మరో 4 లక్షల టన్నులు తీసుకొనేందుకు అంగీకరించింది. దీంతో మొత్తం 12 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ను అందజేయాల్సి ఉంటుంది. ఫలితంగా రాష్ర్టానికి రూ.180 కోట్ల లబ్ధి చేకూరింది. సీఎమ్మార్ గడువు, ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ కోటా పెంపుపై మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు.