యాదాద్రి, అక్టోబర్ 9 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం శరత్ పౌర్ణమి ఉత్సవాలను అర్చకులు విశేషంగా జరిపించారు. కల్యాణమూర్తులను ప్రధానాలయ ముఖ మండపంలో ఆరాధనలు చేశారు. నాలుగు వేదాలు, మంత్రపుష్ప నీరాజనాలు, దివ్యప్రబంధ పారాయణాలు, చతుర్వేద పారాయణాలు చేపట్టి స్వామివారి శరత్పౌర్ణమి మహాత్యాన్ని భక్తులకు వివరించారు. అనంతరం రాత్రి నివేదన చేపట్టారు. స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం సుప్రభాత సేవ, నిజాభిషేకం, తిరువారాధనలు, సహస్రనామార్చనలు జరిపారు. సాయంత్రం ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారికి దర్బార్ సేవ నిర్వహించారు. కల్యాణమూర్తులైన స్వామివారిని గరుడవాహనం, అమ్మవారిని తిరుచ్చిపై వేంచేపు చేసి తిరువీధి సేవను వైభవంగా నిర్వహించారు. స్వామివారి ధర్మదర్శనానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 35 వేల మంది భక్తులు స్వామివారి దర్శించుకోగా.. ఖజానాకు రూ. 50,55,460 సమకూరినట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.