పునర్నిర్మాణ శోభతో జగద్విఖ్యాతంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట దివ్యధామం ఇల వైకుంఠపురిగా అలరారుతున్నది. శిల్పకళా నైపుణ్యానికి ఆధ్యాత్మిక సుగంధాలనద్దిన నూతనాలయంలో జగజ్జేగీ యమానంగా పూజలు అందుకొంటున్న బ్రహ్మాండ నాయకునికి తొలిసారిగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం నాలుగోరోజు అలంకార సేవలకు అంకురార్పణ జరిగింది. మత్స్యావతార రూపుడిని దర్శించుకొనేందుకు భక్తకోటి పోటెత్తారు. నారసింహ నామస్మరణతో యాదగిరిగుట్ట మార్మోగింది. భక్తిపారవశ్య భజనలతో, కూచిపూడి నాట్యాలతో దివ్యానుభూతికి భవ్యవేదికగా మారింది. డ్రోన్ల విహంగ వీక్షణంలో అద్భుత, అపురూప దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి.