Section 22A | యాదాద్రి భువనగిరి జిల్లాలో సెక్షన్ 22ఏ నిషేధిత జాబితాలోని బాధితులకు అడ్డంకులు తొలగుతున్నాయి. నిషేధితా జాబితాపై సర్దుబాటుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అధికారులు పీవోబీ జాబితా నుంచి వేలాది ఇళ్లను తొలగించి, వాటి స్థానంలో కేవలం సర్వే నంబర్లను మాత్రమే పొందిపరిచారు. తమ వెబ్సైట్లో కొత్త జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో సుమారు 40 వేల ఇండ్ల లబ్ధిదారులకు ఊరట లభించినట్లయ్యింది. వారందరికీ గతంలో మాదిరి హక్కులు ఉంటాయని అధికారులు తెలిపారు. కాగా, వ్యవసాయ భూములు మాత్రం యథాతధంగా ఉంటాయని పేర్కొన్నారు.
యాదాద్రి-భువనగిరి జిల్లాలో గత ప్రభుత్వాలు పేదలకు ఇండ్లస్థలాలు పంపిణీ చేశాయి. వారు ఇండ్లు నిర్మించుకొని ఏండ్లుగా ఆయా స్థలాల్లోనే నివాసం ఉంటున్నారు. కొందరు అవసరార్థం అమ్ముకొన్నారు. ఇలా చాలా మేరకు ఇండ్లు పలుమార్లు చేతులు మారాయి. ఇంటి నంబర్లు, విద్యుత్తు, నల్లా కనెక్షన్.. ఇలా అన్నిరకాల అనుమతులు తీసుకొని, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రశాంతంగా సాగుతున్న వారి బతుకులపై ప్రభుత్వం పిడుగు పడేసింది. ఈ ఏడాది జనవరిలో అధికారులు ఆయా ఇండ్లను ‘సెక్షన్ 22ఏ’ జాబితాలో చేర్చారు. ప్రభుత్వం పంపిణీ చేసిన సర్వేనంబర్లలోని స్థలాలు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయాయి. కొన్నిచోట్ల ప్రైవేట్ ఇండ్లపైనా నిషేధం విధించారు. ఇలా మొత్తంగా యాదాద్రి-భువనగిరి జిల్లాలో 39,648 ఇండ్లు, 28,549 ఎకరాల భూములను పీవోబీలో పొందుపరిచారని చెప్తున్నారు.
అత్యధికంగా భువనగిరిలో 5,000 ఇండ్లు, తుర్కపల్లిలో 4,803 గృహాలను 22ఏలో చేర్చారు. ఆయా ఆస్తుల క్రయవిక్రయాలు, బదిలీలు, రిజిస్ట్రేషన్లు చేయకుండా ప్రభుత్వం అడ్డుకొన్నది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండా, కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారని బాధిత ప్రజలు ప్రశ్నించారు. నాలుగైదుసార్లు చేతులు మారిన ఇండ్లు కూడా పీవోబీలో పెట్టడమేందని మండిపడ్డారు. ఈ క్రమంలో పీవోబీ నుంచి ఇండ్ల జాబితాను తొలగించారు.