Anishetti Rajitha | ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అనిశెట్టి రజిత కన్నుమూశారు. కాసేపటి క్రితం ఆమె నివాసంలో గుండెపోటుతో ఆమె తుది శ్వాస విడిచారు.
వరంగల్లో 1958 ఏప్రిల్ 14వ తేదీన అనిశెట్టి రజిత జన్మించారు. చిన్నతనం నుంచి ఆకాశవాణిలో ప్రసారమయ్యే తెలంగాణ ఉద్యమ సంఘర్షణలు, కవి సమ్మేళనాలు, దాశరథి, ఆరుద్ర తదితరుల ఉపన్యాసాలకు ఆకర్షితురాలయ్యారు. 1969లో కాజీపేటలోని ఫాతిమా నగర్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదవుతున్న సమయంలోనే తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు. అనంతరం మలి దశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ ప్రోత్సాహంతో అనేక బహిరంగ సభల్లో తన ఉపన్యాసాలతో ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షితులయ్యేలా చేశారు.
1973లో చైతన్యం పడగెత్తింది అనే తొలి రచనతో తన సాహిత్య జీవితాన్ని ప్రారంభించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో చేసిన ఈ రచన ద్వారా ఆమె సాహితీ వ్యక్తుల ప్రశంసలు అందుకున్నారు. 1980ల నాటి ఉద్యమ అనుభవంతో ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’, స్త్రీవాద ఉద్యమ ప్రభావంతో ‘నేనొక నల్లమబ్బునవుతా’, ‘చెమట చెట్టు’, ‘ఓ లచ్చవ్వ’, ‘ఉసురు’, ‘గోరంత దీపాలు’, హైకూల సంపుటి, ‘దస్తఖత్’, ‘అనగనగా కాలం’, ‘మట్టి బంధం’, నన్హే ఓ నన్హే’, ‘మార్కెట్ స్మార్ట్ శ్రీమతి’, ‘నిర్భయాకాశం కింద’, ఆచార్య పాకాల యశోదా రెడ్డిపై మోనాగ్రాఫ్ రాశారు. అలా ఇప్పటివరకు ఆమె దాదాపు 500కి పైగా కవితలు, 100కి పైగా వ్యాసాలు, 30కిపైగా కవితలు, 30కిపైగా పాటలు రాశారు. తన సాహిత్యంతో సామాజిక అంశాలను స్పృశించిన అనిశెట్టి రజితను అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు అవార్డులతో సత్కరించాయి. 2014లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం అందుకున్నారు. అలాగే 2016లో తెలుగు రచయితల వేదిక వారి అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం అందుకున్నారు.