హైదరాబాద్: శ్రీశ్రీ రవిశంకర్ స్థాపించిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి అక్టోబర్ 1 వరకు అమెరికాలో వాషింగ్టన్లోని నేషనల్ మాల్ ప్రాంగణంలో జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాలకు వివిధ దేశాల నుంచి 17 వేల మంది కళాకారులు పాల్గొననున్నారు. భారత్ కళాకారులతో పలు రకాల నృత్య ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
ఉత్సవాలకు ప్రపంచ నలుమూలల నుంచి వివిధ దేశాల నేతలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల్లోని భిన్నత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ కార్యక్రమాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ గతంలో మూడుసార్లు వివిధ దేశాల్లో నిర్వహించింది.