మేడ్చల్, జూలై 16 (నమస్తే తెలంగాణ): మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బహుదూర్పల్లిలో రూ.2.5 కోట్లతో నిర్మించిన జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఒకేషనల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నతస్థాయిలో ఉండాలని కోరుకుంటారని, వారి కలలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ ముందు చూపుతో ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ వరకు ఉచిత విద్య అందిస్తున్నారని తెలిపారు.
1,052 గురుకులాల్లో ఐదు లక్షల మంది విద్యార్థులకు ఏటా ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. ఇంట్లో కూడా దొరకని సకల సౌకర్యాలు పాఠశాలల్లో అందించటం తెలంగాణలో తప్ప ఎక్కడా లేదని పేర్కొన్నారు. వెయ్యి మందికిపైగా గురుకుల విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సంపాదించారని వెల్లడించారు. విద్యా వ్యవస్థలో గత 68 ఏండ్లలో జరగని అభివృద్ధి, మార్పులు ఎనిమిదేండ్లలోనే చేసి చూపామని తెలిపారు. మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందించేందుకు రూ.7,200 కోట్లు ఖర్చుచేస్తున్నట్టు వివరించారు.