హుజూరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తనపై దాడి చేయించుకొని సానుభూతితో ఓట్లు పొందాలని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కుట్ర చేస్తారంటూ టీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు నిజమవుతున్నాయి. శుక్రవారం వీణవంక మండలం నర్సింహుపల్లి ప్రచారంలో ఈటల రాజేందర్ నోటివెంట వచ్చిన మాటలతో దాడి కుట్ర వ్యూహం బట్టబయలైంది. తనపై దాడి చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, దాడి జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన మంత్రి కొప్పుల ఈశ్వర్ గత నెల 30న కమలాపూర్లో ప్రచారంలో ఈ కుట్రను వివరించారు. ‘ఈటల రాజేందర్ కాళ్లకో, చేతులకో కట్టు కట్టుకొని వస్తడు. టీఆర్ఎస్ దాడి చేయించిందని కొత్త నాటకమాడుతడు. ప్రజల సానుభూతి పొందేందుకు కుట్ర పన్నుతడు. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో ఈ డ్రామా ఆడనున్నట్టు మాకు పక్కా సమాచారం ఉన్నది. బీజేపీ నాయకులు బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తరు’ అని మంత్రి కొప్పుల చెప్పా రు. ఆ దిశగానే సానుభూతి కోసం ఈటల తనపై దాడి చేయించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నది. దళితుల భూములు కబ్జాచేసి మంత్రి పదవి కోల్పోయి, ఆస్తులను కాపాడుకొనేందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల.. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమి భయంతో రకరకాల వ్యవహారాలకు దిగుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.