‘ఇకపై దేశంలో ఉప్పుడు బియ్యం కొనే ప్రశ్నే లేదు.. రాష్ర్టాలు తమకు అవసరాలుంటే.. భేషుగ్గా కొనుక్కోవచ్చు. మేం మాత్రం కొనేది లేదు..’ కేంద్ర ప్రభుత్వం లోక్సభ సాక్షిగా ప్రకటించిన విధాన నిర్ణయమిది. బీజేపీకి చెందిన ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జోషి రాతపూర్వకంగా ఇచ్చిన జవాబు సారాంశమిది.
ఉప్పుడు బియ్యం ఎక్కువగా వాడే రాష్ర్టాల్లో దాని ఉత్పత్తి బాగా పెరిగిపోయిందని.. ఈ నేపథ్యంలో ఎఫ్సీఐ నుంచి బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం తేల్చి చెప్పింది. యాసంగి ధాన్యం కొనుగోలుపై తెలంగాణలో ఏడాదికాలంగా జరుగుతున్న పోరాటంపై కేంద్రం చీమ కుట్టినంత కూడా స్పందించకపోవటం దారుణం.
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇటు ప్రభుత్వం, అటు రైతులు ఉద్యమిస్తున్నా కేంద్రం మాత్రం తన మొండి వైఖరినే కొనసాగిస్తున్నది. రైతులు నష్టపోతున్నప్పటికీ కేంద్ర సర్కారుకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం గమనార్హం. యాసంగిలో ధాన్యం(బాయిల్డ్ రైస్) కొనుగోలు చేయలేమన్న కేంద్ర సర్కారు… రాష్ర్టాలకు మాత్రం ఒక ఉచిత సలహా ఇచ్చింది. అవసరం ఉంటే రాష్ర్టాలే సొంతంగా కొనుగోలు చేయాలంటూ సలహా ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్య వాఖ్యలపై అన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని రాష్ర్టాలే కొనుగోలు చేస్తే ఇక కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉన్నట్టు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైతులకు నష్టం జరగకుండా.. ఎన్ని ఇబ్బందులున్నా ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్ ఉన్నా… ఎగుమతులపై దృష్టేది.. ?
యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ప్రతిసారి కేంద్రం చెప్పే ఒకే ఒక సమాధానం ‘దేశంలో బాయిల్డ్ రైస్ వినియోగం తగ్గింది. నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే యాసంగి ధాన్యం కొనుగోలు చేయలేం’. అయితే ధాన్యం కొనుగోలు చేయాలంటే సాకులు చెబుతున్న కేంద్రం.. పరిష్కార మార్గాలను మాత్రం అన్వేషించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు దేశంలో ఉత్పత్తి అయినటువంటి బియ్యం, నూకల ఎగుమతిపై దృష్టి పెట్టడం లేదు. వాస్తవానికి మన దేశంలోని నూకలు, బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఇక్కడి రైతుల వద్ద ఉత్పత్తి అయిన బియ్యాన్ని కొనుగోలు చేసి ఎగుమతులు చేయోచ్చు. కానీ ఎగుమతుల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం తీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండడం గమనార్హం.
కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పోరాటం…
తెలంగాణలో యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ పోరాటం కొనసాగుతూనే ఉంది. ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాడాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వానికి ఉగాది వరకు సమయం ఇచ్చి.. అయినప్పటికీ మార్పురాని పక్షంలో క్షేత్రస్థాయిలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. రైతులను భాగస్వామ్యం చేసి బీజేపీ కుటిల నీతిని, బండారాన్ని బయటపెట్టాలని సీఎం నిర్ణయించారు.