హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో మహిళల నమోదు క్రమంగా పెరుగుతున్నది. డిగ్రీ, పీజీ సహా వృత్తివిద్యాకోర్సుల్లోనూ వారి హవా కొనసాగుతున్నది. గత మూడేండ్ల నుంచి అన్నిరకాల కోర్సుల ప్రవేశాలు, ఉత్తీర్ణతలో మహిళలే సత్తా చాటుతున్నారని ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన 2019 -20 రాష్ట్ర ఉన్నత విద్య అకడమిక్ ప్రొఫైల్లో వెల్లడైంది. రాష్ట్రంలోని మొత్తం 2,071 కాలేజీల్లో 13.2% కాలేజీలను మహిళల కోసమే నిర్వహిస్తున్నారని, మహిళా విద్యార్థులకు ప్రత్యేక వసతులు కల్పించడంలో తెలంగాణ ముందంజలో ఉన్నదని నివేదిక స్పష్టంచేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
2019-20 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో 81,042 మంది పురుషులు, 1,03,478 మంది మహిళలు ప్రవేశాలు పొందారు. డిగ్రీ కోర్సుల్లో 5,19,501 మంది పురుషులు, 5,59,280 మంది మహిళలు.. సర్టిఫికెట్ కోర్సుల్లో 923 మంది పురుషులు, 1,290 మంది మహిళలు చేరారు.
రాష్ట్రంలో మహిళలకు 1,72,089, పురుషులకు 1,07,525 వసతిగృహాలు ఉన్నాయి.
డిగ్రీ, పీజీ కోర్సుల్లో మహిళల ఉత్తీర్ణత శాతం 57, పురుషుల ఉత్తీర్ణత శాతం 43గా ఉన్నది.
2013-14 నుంచి పురుషుల ఎన్రోల్మెంట్ క్రమంగా తగ్గుతుండగా మహిళల ఎన్రెల్మెంట్ పెరుగుతున్నది. మహిళల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) 36.4 శాతం, పురుషుల జీఈఆర్ 34.8 శాతం ఉన్నది.
మహిళలకు యూనివర్సిటీల్లో 91%, కాలేజీల్లో 87%, స్టాండలోన్ కాలేజీల్లో 92% ప్రత్యేక గదులు, మూత్రశాలలు అందుబాటులో ఉన్నాయి.
యూనివర్సిటీల్లో 61%, కాలేజీల్లో 52%, స్టాండలోన్ కాలేజీల్లో 60% మంది విద్యార్థులు సెల్ఫ్ డిఫెన్స్ తరగతులను సద్వినియోగం చేసుకొంటున్నారు.