హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): కదం తొక్కి తెలంగాణ మహిళల హక్కులను కాపాడుకుందామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను అనునిత్యం నిలుపుకుంటూ, ఆ స్ఫూర్తితో ముందుకు సాగుదామని అన్నారు. సమాజంలో ఎదుర్కొనే కష్టాలన్నింటిని ఛేదించడానికి, వారికి అండదండగా నిలిచేందుకు మహిళా దినోత్సవం స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణభవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత తెలంగాణతల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భగా కవిత మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ, సావిత్రభాయిపూలే, రాణీరుద్రమదేవి వంటి వీరవనితలు చేసిన పోరాటాలు ఆడబిడ్డలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. మహిళా దినోత్సవం హక్కులను కాపాడుకునే దినోత్సవమని, సంబురంగా జరుపుకోవాలని, పోరాటస్ఫూర్తిని నిలుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, సామ హేమ తదితరులు పాల్గొన్నారు.