మెట్పల్లి రూరల్, నవంబర్ 15: ‘మా మద్దతు నీకే.. గెలుపునీదే అన్నా’ అంటూ కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ను మెట్పల్లి మండల ఆడబిడ్డలు దీవించారు. బుధవారం ఆయన కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలంలో విస్తృత ప్రచారం చేయగా.. ఆయా గ్రామాల్లో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఏ గ్రామానికి వెళ్లినా తిలకం దిద్ది.. ఆశీర్వాదాలు అందించారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈ నెల 3న కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇస్తామని ప్రకటించారని, తాము ఎన్నటికీ మరిచిపోమని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.