హైదరాబాద్ : నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ ప్రియుడు తన ప్రియురాలిని హత్య చేసి పారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన నాగచైతన్య అనే యువతి ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న క్రమంలో మెడికల్ రిప్రజెంటేటివ్ కోటిరెడ్డి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఆమెను కోటిరెడ్డి ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. పెళ్లి చేసుకుందామని ఒప్పించాడు. దీంతో నాగచైతన్య అతన్ని నమ్మి శారీరకంగా దగ్గరయ్యారు. గతేడాది కాలం నుంచి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో నాగచైతన్య నర్సుగా పని చేస్తోంది. అయితే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా కోటిరెడ్డి చెప్పాడు. కొద్ది రోజుల నుంచి పెళ్లి ప్రస్తావన తేగానే ముఖం చాటేస్తున్నాడు. గొడవలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలో వారిద్దరూ చందానగర్లోని ఓ లాడ్జిలో ఈ నెల 23న దిగారు. ఆ తర్వాత ప్రియురాలిని చంపిన కోటిరెడ్డి.. లాడ్జి గదికి తాళమేసి పారిపోయాడు. విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ గది తలుపులు తెరిచి చూడగా యువతి చనిపోయి ఉంది. ఇక కోటిరెడ్డి ఒంటిపై గాయాలు చేసుకుని ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో చేరాడు. కోటిరెడ్డి వద్ద లాడ్జి గది తాళాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఆస్పత్రి సిబ్బందికి కోటిరెడ్డి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. చందానగర్ పోలీసులు ఒంగోలు చేరుకుని కోటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.