కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో (Kamareddy) ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఒకేసారి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పీఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ బుధవారం కనిపించకుండాపోయారు. వారి వస్తువులు సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున కనిపించడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయానికి శ్రుతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభించాయి. ఇక ఎస్సై ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ సెల్ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్ఆఫ్ వస్తుండటంతో పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీయడం ఆరంభించారు. ఇదే క్రమంలో బీబీపేట పీఎస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రుతి.. విధులు ముగిసినా ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ క్రమంలో సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో ఉన్నట్టు గుర్తించి అక్కడకు వెళ్లారు. చెరువుకట్టపై ఎస్సై సొంత కారుతో పాటు ఫోన్లు, చెప్పులు లభ్యమయ్యాయి.
వాటి ఆధారంగా ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతితోపాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్గా గుర్తించారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పీ సింధూశర్మ చెరువు వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో కానిస్టేబుల్గా పని చేస్తున్నది. మెదక్ జిల్లాకు చెందిన సాయికుమార్ గతంలో బీబీపేట ఎస్సైగా పని చేసి, బదిలీపై భిక్కనూరుకు వచ్చారు. బీబీపేటలో పని చేసిన సమయంలో వీరికి పరిచయం ఏర్పడిందని భావిస్తున్నారు.