హైదరాబాద్: మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా అని కాంగ్రెస్ సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తున్నదని విమర్శించారు. జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. 9 నుంచి 12 తరగతి వరకు రాష్ట్రంలో చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతున్నదని, దీని ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారని చెప్పారు.
హైదరాబాద్లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారని వెల్లడించారు. కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారన్నారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలలో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పారు.
2023-24 విద్యాసంవత్సరం వరకు 6 నుంచి 12 తరగతి వరకు నాలుగేండ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించాం. దాని కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియేట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారు లోకల్గానే పరిగణించబడే వారు. తాజాగా ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారు. దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా.. గతంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా “మెడికల్ సీట్లలో లోకల్కు కోత..” పేరుతో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన వార్త క్లిపింగ్స్ను కేటీఆర్ షేర్చేశారు.
మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా ?
స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోంది.
జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయి.
9 వ తరగతి నుంచి 12 తరగతి వరకు… pic.twitter.com/sXNeFvpQFU
— KTR (@KTRBRS) August 6, 2024