నమస్తే తెలంగాణ నెట్వర్క్ ;బార్బర్ కొడుకు.. కూలీ కుమార్తె.. డ్రైవర్ కొడుకు.. వీరిలో ఎవరైనా తాము డాక్టర్ అవుతామని ఊహించగలరా? కలలో అయినా అలా అనుకోగలరా? ఊహకే అందని ఎంబీబీఎస్ చదువు ఇప్పుడు పేదల చెంతకు వచ్చింది. నిరుపేదల ముంగిట్లో నిలిచింది. సీఎం కేసీఆర్ సంకల్పంతో ఇప్పుడు తెలంగాణ బిడ్డలు ఉచితంగా వైద్య విద్యను అభ్యసించే అవకాశం లభించింది. తమకీ అదృష్టాన్ని తెచ్చిపెట్టిన సీఎం కేసీఆర్కు తామంతా రుణపడి ఉంటామని వేనోళ్ల పొగుడుతున్నారు. కేసీఆర్ దయతో తమ కుటుంబంలోనూ ఓ డాక్టర్ ఉన్నాడని గర్వంగా చెప్పుకుంటామని తలెత్తి చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రారంభించిన 9 మెడికల్ కాలేజీలతో రాష్ట్రంలోని మొత్తం వైద్య కళాశాలల సంఖ్య 34కు పెరిగింది. దాదాపు ప్రతీ జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా తెలంగాణ వైద్యుల కార్ఖానాగా మారింది. ఇకపై రాష్ట్రం నుంచి ప్రతి ఏడాది 10 వేల మంది వైద్యులు రానుండడం రాష్ర్టానికే కాదు.. దేశానికే గర్వకారణం.
నా కొడుక్కి డాక్టర్ సీటు కేసీఆర్ పుణ్యమే
సీఎం కేసీఆర్ పుణ్యం వల్లే నా కొడుకు కార్తీక్కు డాక్టర్ సీటు వచ్చింది. సారు జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతో నా కొడుక్కి అవకాశం వచ్చింది. రైతు బిడ్డలు చదువులో రాణించాలని సీఎం సారు కాలేజీలు ప్రారంభించి, మంచి చదువును అందిస్తున్నడు. మా అసొంటి కుటుంబాలకు లక్షలు పెట్టి చదివించే స్థోమత లేదు. నా చిన్న కొడుకు సాయికిరణ్ ఆసిఫాబాద్ సోషల్ వెల్ఫేర్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. నేను ఎలాగూ చదువుకోలేదు. నా పిల్లలనైనా చదివించి వారి భవిష్యత్ బాగుండాలనేదే కోరిక. అప్పుడు నాకు చదవాలని, ఉద్యోగం చేయాలని చెప్పే వారు లేరు. నేను పడే బాధలు నా బిడ్డలు పడకూడదు. ఎంత కష్టమైనా వారెంత వరకు చదువుకుంటానంటే అంత వరకు చదివిస్తా. కేసీఆర్ సారులాంటి నాయకుడు ఉన్నన్ని రోజులు తెలంగాణలోని ప్రజలందరు సంతోషంగా ఉంటారు.
– నాగపురి తిరుపతి, విద్యార్థి తండ్రి
డాక్టర్ కల నెరవేరింది
మాది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, కౌటాల మండలంలోని తుమ్డిహట్టి గిరిజన గ్రామం. మా అమ్మ అరుణ, నాన్న తిరుపతి వ్యవసాయం చేస్తూ నన్ను చదివించారు. పదో తరగతి పూర్తయ్యాక డాక్టర్ కావాలని ఉండేది. ఇంటర్ అయిపోగానే హైదాబాద్లో ఏడాదిపాటు లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తే ఆల్ ఇండియా స్థాయిలో 1,59,268వ ర్యాంకు వచ్చింది. రిజల్ట్ చూసి ఆనందం అనిపించింది. ఇప్పుడు చదివిన ప్రాంతంలోనే ఎంబీబీఎస్ చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఎంబీబీఎస్ ఎండీ పూర్తిచేసి మా ప్రాంతంలో నిరుపేదలకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
-నాగపురి కార్తీక్, వైద్య విద్యార్థి
పేదలు వైద్యులయ్యే అవకాశం కలిగింది
మాది మధ్యతరగతి కుటుంబం. తెలంగాణ రాకముందు ఎంబీబీఎస్ చదవడం అంటే ఎంతో కష్టం. ఎందుకంటే నీట్ పరీక్ష రాసేవారు లక్షల్లో ఉంటే సీట్లు మాత్రం వందల్లోనే ఉండేవి. మంచి ర్యాంకు వచ్చినా మన రాష్ట్రంలో సీటు దొరికేది కాదు. విదేశాలకో, ఇతర రాష్ర్టాలకో వెళ్లాల్సి వచ్చేది. కానీ సీఎం కేసీఆర్ సార్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు సుమారు 10వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్ధులకే ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం నీట్ రాసిన వేలాది మంది విద్యార్ధులకు గొప్ప వరంగా మారింది. పేదలు, సామాన్యులకు డాక్టర్లయ్యే అవకాశం కలిగింది. మా ఊరికి దగ్గరలోని జనగామ మెడికల్ కాలేజీలో నాకు సీటు వచ్చింది.ఆ అదృష్టాన్ని కల్పించిన సీఎం సార్కు మా కుటుంబం రుణపడి ఉంటుంది.
-సామల హిమబిందు, తిరుమలగిరి, సూర్యాపేట జిల్లా
థ్యాంక్స్ టు కేసీఆర్ సార్
మా నాన్న పేరు బ్రహ్మానందం ప్రైవేట్ జాబ్ చేస్తారు. అమ్మ లక్ష్మి గృహిణి. మాది మధ్యతరగతి కుటుంబం. నన్ను డాక్టర్ చేయాలనేది వారి కోరిక. నీట్ రాసే ముందు దేశంలో ఎక్కడ సీటు వచ్చినా వెళ్దామని అనుకున్నా. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నదని, నాకు పక్కనే ఉన్న జనగామలో సీటు వస్తుందని అసలు ఊహించలేదు. తెలంగాణ రాకముందు వైద్యవిద్య అంటే అందని ద్రాక్షలా అనిపించేది. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి వాటిని ఎడ్యుకేషన్ హబ్లుగా తీర్చిదిద్దేలా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్ సర్ తీసుకున్న నిర్ణయం వల్లే నాకు మెడిసిన్ దక్కే అవకాశం దక్కింది. బాగా చదువుకొని మంచి డాక్టర్గా పేదలకు వైద్య సేవలు అందిస్తా. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ సర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– కేడిదేవి పద్మజ, హనుమకొండ
సీఎం కేసీఆర్ నా కల నెరవేర్చారు
మాది పక్కనే ఉన్న యాదాద్రి భువనగిరి. డాక్టర్ అయి పేదలకు వైద్య సేవ చేయాలనేది నా చిన్ననాటి కల. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించాలనే పట్టుదలతో గత ఏడాది నీట్ రాసా. ఫస్ట్టైం రాసినప్పుడు ర్యాంకు వచ్చినా సీటు రాలేదు. రెండోసారి రాసిన తర్వాత సీటు ఎక్కడ వస్తుందో.. ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందోననే ఆందోళన ఉండేది. తెల్లకోటు వేసుకుంటానా? లేదా? అనే సందేహం కలిగేది. డబ్బులు పెట్టి ఎంబీబీఎస్ చదివే స్థోమత మాకు లేదు. ఇక దేవుడే దిక్కు అని మొక్కుకున్న. ఆ దైవం కేసీఆర్ రూపంలో జిల్లాకో మెడికల్ కాలేజీ వరాన్ని ఇచ్చారు. నా అదృష్టం కొద్దీ ఇప్పుడు పక్కనే ఉన్న జనగామలో అతి సులభంగా అడ్మిషన్ వచ్చింది. దీనికి కారణం కేసీఆర్ సార్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే. ఇంటి వద్దనే ఉంటూ డాక్టర్ అయ్యే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. నా కల నెరవేర్చిన సీఎం కేసీఆర్ సార్కు థ్యాంక్స్.
– నీరడి స్వప్నిక, యాదాద్రి భువనగిరి జిల్లా
మాలోంటళ్లకు వైద్య విద్య చేరువైంది
నా కూతురు వింధ్యను డాక్టర్ చేయాలన్న కోరిక ఉండేది. కేసీఆర్ సార్ పుణ్యమా అని అది ఇప్పుడు నెరవేరింది. వృత్తిరీత్యా బార్బర్ను అయిన నేను రోజూ రాత్రి 11 గంటల వరకు పనిచేసి పిల్లల్ని చదవించా. నా కోరికకు అనుగుణంగానే వింధ్య బాగా చదివింది. వింధ్యకు ఎంబీబీఎస్ సీటు రావడం ఆనందంగా ఉంది. గతంలో బాగా డబ్బున్నవారే తమ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించుకునేవారు. ఇప్పుడు కేసీఆర్ సార్ అందరికీ ఆ విద్యను అందిస్తున్నారు. కాలేజీలు పెంచడం వల్లే ఇది సాధ్యమైంది. మాలాంటి వారికి ఎంబీబీఎస్ చదువు దగ్గరైంది.
– మంగళారపు నర్సయ్య, బార్బర్, బొమ్మల మేడిపల్లి, జగిత్యాల జిల్లా
కార్డియాలజిస్ట్ అవుతా
చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్న కోరిక నెరవేరబోతోన్నది. భవిష్యత్తులో కార్డియాలజిస్ట్నవుతా. అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. నేను డాక్టర్ కావడానికి నా తల్లిదండ్రులు రాత్రీపగలు తేడా లేకుండా ఎంతో కష్టపడి చదివించారు. వారి ఆశయాలకు అనుగుణంగా చదివి వారి కలను నెరవేరుస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది. జిల్లాకో మెడికల్ కాలేజీ తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ సార్ పట్టుదలతోనే మాలాంటి వాళ్లకు డాక్టర్ అయ్యే అదృష్టం దక్కింది.
-వింధ్య, ఎంబీబీఎస్ విద్యార్థి, బొమ్మల మేడిపల్లి, జగిత్యాల జిల్లా
సీటు వస్తుందనుకోలేదు
మా కొడుకు షరీఫ్ను డాక్టర్ చదివిస్తామంటే అందరూ ఎగతాళి చేసేవారు. లక్షలు పోసి చదవించడం మీ వల్ల అవుతుందా? అనే వారు. అయినా కొడుకు మాత్రం ఎవరో ఒకరు సాయం చేస్తారని నమ్మకంగా చెప్పేవాడు. దేవుడు సీఎం కేసీఆర్ రూపంలో వచ్చి పేదింటి పిల్లలకు ఎంబీబీఎస్ చదివే అవకాశం కలిగించాడు. నా కొడుక్కి సీటు వస్తుందని అనుకోలేదు. 24గంటల పాటు ఇంట్లోనే కూర్చుని కష్టపడి చదివి ర్యాంకు సాధించాడు. జిల్లాకు ఒక కాలేజీ ఏర్పాటు చేయడం వల్ల నా కొడుక్కి మెడికల్ సీటు వచ్చింది. పోయిన సంవత్సరం వచ్చిన ర్యాంకుతో ప్రైవేటు కాలేజీలో సీటు వచ్చేదే, కానీ పది లక్షల రూపాయల దాకా ఫీజుల ఖర్చు అయితయని చెప్పిండు. అన్ని పైసలు ఎక్కడినుంచి తేవాలి. అయితే నా కొడుకు మాత్రం పట్టు వదలకుండా ఒక సంవత్సరం ఆగుదాం, ప్రభుత్వ కాలేజీలో సీటు సాధిస్తా అన్నడు. ఈసారి మార్కులు ఎక్కువ వచ్చినయ్. దీంతో ఖమ్మం మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ప్రభుత్వ కాలేజీలో సీటు రావడం వల్ల డబ్బులు ఖర్చు కాకుండా ఎంబీబీఎస్ చదివే అవకాశం దక్కింది. నిజంగా ఇది మా అదృష్టం. కేసీఆర్ మాత్రం జిల్లాకో కాలేజీ పెట్టి చాలా మందికి న్యాయం చేశారు. మా కుటుంబమంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటది.
– హసీనా, విద్యార్థి తల్లి, ఏటూరునాగారం, ములుగు జిల్లా
డబ్బులు లేక కోచింగ్కు వెళ్లలేదు
మా కుటుంబ ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. కాబట్టే కోచింగ్కు వెళ్లలేకపోయాను. ఇంట్లోనే ఉండి సీరియస్గా చదివాను. 2021-22లో వచ్చిన 447 మార్కులకు ప్రభుత్వ కళాశాలలో సీటు వచ్చే పరిస్థితి కన్పించలేదు. ప్రైవేటు కళాశాలలో చదవడానికి డబ్బులు లేవు. నిరాశకు గురికాకుండా పట్టువదలకుండా చదివాను. 497 మార్కులు సాధించాను. ఖమ్మంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండడం వల్లే ఈ అవకాశం దక్కింది. నాలాంటి ఎంతోమంది ఇక్కడ చదువుకుంటున్నారు. ఎంబీబీఎస్ చేసే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పేదలకు సేవ చేస్తా. ప్రభుత్వం పేరు నిలబెట్టుతాం.
– తాహెర్ షరీఫ్, ఎంబీబీఎస్ విద్యార్థి