హైదరాబాద్: తెలంగాణలో ఏవియేషన్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komatireddy Venkatreddy) అన్నారు. రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానం ఉందని చెప్పారు. ఏరో స్పేస్ (Wings India) పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలమని తెలిపారు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా-2024ను ప్రదర్శనను కేంద్ర జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్లో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. వ్యవవసాయం, అత్యవసరాలు, శాంతిభద్రతల్లో డ్రోన్లను వినియోగిస్తున్నామని తెలిపారు.
పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరుగనున్న ఈ ప్రదర్శనకు దేశ విదేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం బోయింగ్ 777-9 విమానంతో పాటు భారీ విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లను ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో సందర్శకులను ఏర్ షోకు అనుమతిస్తారు. టికెట్ ధర రూ.750గా నిర్ణయించారు. బుక్మై షో యాప్ ద్వారా ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చు.