ఇది నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం. చాలా కాలంగా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా. మేము రాజకీయ కుటుంబం నుంచి వచ్చినందున ప్రజాసేవకు అలవాటు పడ్డాం. ప్రజలకు సేవ చేయాలంటే అధికారం అవసరం లేదని అనుకున్నాను. కానీ.. అధికారం ఉంటే ప్రజలకు మరింత సేవ చేయవచ్చని అర్థం చేసుకున్నాను.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): దేశం గర్వించే మాజీ ప్రధాని, తెలంగాణ ఠీవి.. మన పీవీ కుమార్తె సురభి వాణీదేవి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఆదివారం ప్రమాణం స్వీకరించారు. శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి ఆమె చేత ప్రమాణం చేయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురుగా, విద్యావేత్తగా, మేధావిగా ఆమె పట్టభద్రుల అభిమానాన్ని చూరగొన్నారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు షాకిస్తే, తక్కువ సమయంలోనే పట్టభద్రులను ఆకట్టుకొని ఆమె ఘనవిజయం సాధించి, తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రమాణం చేసిన అనంతరం వాణీదేవి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. తన విజయానికి కష్టించి పనిచేసిన పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు, తనకు ఓటు వేసి గెలిపించిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని ఘట్టమని వ్యాఖ్యానించారు. ‘నిజానికి చాలా కాలం గా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా ను. మేము రాజకీయ కుటుంబం నుంచి వచ్చినందున ప్రజాసేవకు అలవాటు ప డ్డాం. ప్రజలకు సేవ చేయాలంటే అధికారం అవసరం లేదని అనుకున్నాను. కానీ.. అధికారం ఉంటే ప్రజలకు మరింత సేవ చేయవచ్చని అర్థం చేసుకున్నాను’ అని ఆమె తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, పట్టభద్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషిచేస్తానని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ప్రమాణ స్వీకారం తర్వా త వాణీదేవికి శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గుర్తింపుకార్డును, మండలి నిబంధనలకు సంబంధించిన పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ విప్ ఎమ్మెస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు కేవీ వివేకానంద, బేతి సుభాష్రెడ్డి, కాలే యాదయ్య, జైపాల్యాదవ్, మెతుకు ఆనంద్, ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, పురాణం సతీశ్, యోగానంద్, అసెం బ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహచార్యులు, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, పలువురు న్యాయవాదులు, టీఆర్ఎస్ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వాణీదేవి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, సమీప ప్రత్యర్థిపై 11,703 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఆమెకు తొలి, ద్వితీయ ప్రాధాన్య ఓట్లను కలుపుకొని మొత్తం 1,49,269 ఓట్లు లభించాయి.