మహదేవపూర్, మార్చి 3 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని సూరారం గ్రామంలో వన్యప్రాణి మాంసాన్ని(Wildlife meat) అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ మండల అధికారి కమల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాదోట సురేశ్ వద్ద వన్యప్రాణి దుప్పి(Moose)(సుమారు కేజీబరువు గల) మాంసం ఉన్నట్లు తెలిసింది.
దీంతో అతడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా దుప్పి మాంసం దొరకడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ బీట్ అధికారి కృపాకర్, సెక్షన్ అధికారి వరుణ్ పంచనామా చేసి విచారించారు. అదే గ్రామానికి చెందిన కుంభం రమేశ్ వద్ద నుంచి మాదోట సురేశ్ దుప్పి మాంసం కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్వో కమల తెలిపారు.
కాగా, కుంభం రమేశ్ పరారీలో ఉన్నాడని, పట్టుబడిన నిందితుడిని కోర్టుకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని మండల కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయాలనికి తరలించి, వైద్య పరీక్షల నిమిత్తం వెటర్నరీ వైద్యులకు అప్పగించినట్లు తెలిపారు. తదుపరి దానిని హైదరాబాద్లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ)కి తరలించనున్నట్లు మండల అటవీశాఖ అధికారి వెల్లడించారు.