Achampet | అచ్చంపేట, జనవరి 13: పెద్దలను ఎదురించి మూడేండ్ల కిందట ఆర్యసమాజ్లో ప్రేమ పెండ్లి చేసుకున్నది ఓ జంట. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్న ఆ దంపతులు.. కొంతకాలం బాగానే ఉన్నా.. ఇటీవల ఆర్థిక సమస్యలు తలెత్తి తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు ఆ యువకుడిని దారుణంగా కొట్టి చంపారు. దీంతో సంక్రాంతి సంతోషం నిండాల్సిన వారి కుంటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ ఘటన శనివారం నాగకర్నూల్ జిల్లా అచ్చంపేటలో సంచలనం సృష్టించింది. లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ అరుణబాయి, శ్రీనివాసులు కుటుంబం అచ్చంపేటలో నివాసం ఉంటున్నది. శ్రీనివాసులు ఎల్ఐసీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు. వారి కుమార్తె అత్తికారి సింధు (26) డిగ్రీ చదివింది. అదే కళాశాలలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం అన్నాసాగర్కు చెందిన తోట నాగార్జున (30) కూడా అదే కళాశాలలో డిగ్రీ చదివాడు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా.. ఈ పెండ్లి వద్దని ఆమె తల్లిదండ్రులు ఎన్నోసార్లు మనస్సు మార్చే ప్రయత్నం చేసినా యువతి వినిపించుకోలేదు. పెద్దలను ఎదురించి ఆర్యసమాజ్లో ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడటమే మానేశారు.
అచ్చంపేట పట్టణంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ.. నాగార్జున స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తుండగా.. సింధు టీటీసీ పూర్తి చేసి టెట్కు ప్రిపేరవుతున్నది. నాగార్జున ఎక్కువగా స్నేహితులతో బయట సరదాగా తిరిగేవాడు. కుటుంబం గడవడమే కష్టంగా మారి తరచూ ఇద్దరి మధ్య గొడవ జరిగేది. శుక్రవారం కూడా ఇద్దరూ ఘర్షణపడ్డారు. మనస్తాపానికి గురైన సింధు కోపంతో గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకున్నది. నాగార్జున వెంటనే దవాఖాన సిబ్బందికి విషయం చెప్పడంతో అందరూ వచ్చి తలుపులు బద్దలుకొట్టారు. డాక్టర్ కృష్ణ వెంటనే సీపీఆర్ చేసి కొన ఊపిరితో ఉందని చెప్పగా నాగర్కర్నూల్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వెంటిటేటర్ ఉన్న అంబులెన్స్లో హైదరాబాద్కు తీసుకెళ్లారు. అప్పటికే సింధు మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు.
సింధు మృతదేహాన్ని అంబులెన్స్లో హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు తీసుకొస్తున్న క్రమంలో.. మృతురాలి కుటుంబసభ్యులు మరో కారులో వచ్చి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు వద్ద అంబులెన్స్ను ఆపారు. నాగార్జునను తమ కారులో ఎక్కించుకుని దూరంగా తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేస్తూ తీవ్రంగా కొట్టారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక మరో తుఫాన్ వాహనంలో మృతదేహాన్ని అచ్చంపేటకు తరలించి ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో వదిలి పారిపోయారు. యువతి మృతదేహంతో వచ్చిన అంబులెన్స్లో భర్త నాగార్జున లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో వాహనం ఆగి ఉన్నదన్న సమాచారంతో అక్కడికెళ్లి చూడగా.. ఆ వాహనంలో యువకుడు విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారించగా ఆత్మహత్య చేసుకున్న సింధు భర్త నాగార్జునగా తేలింది. శనివారం ఉదయం ఇరు కుటుంబాల సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు అచ్చంపేట సీఐ అనుదీప్, ఎస్సై గోవర్ధన్ తెలిపారు. మృతదేహాలను ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.